తల్లికి కొడుకుపై ఉన్న ప్రేమ ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైనది, నిస్వార్థమైనది. అతనికి ఏ చిన్న కష్టం వచ్చినా తనే ముందు నిలబడుతుంది. లోకమంతా కొడుకుని తప్పుపట్టినా, వేలెత్తి చూపినా.. తల్లి మాత్రం అతనికి ఆసరాగా నిలిచి, ప్రేమతో కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. కొడుకు సంతోషమే తన శ్వాసగా భావించే తల్లి ప్రేమను ఏ మాటల్లోనూ వర్ణించలేము. కన్నడ రాకింగ్ స్టార్ యష్ తల్లి ఆవేదనే ఇందుకు ఉదాహరణ.
యష్ హీరోగా గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టాక్సిక్' చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫలితంపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు, ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో, యష్ తల్లి పుష్ప స్పందిస్తూ నెటిజన్లకు, ట్రోలర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. తన కొడుకును ఏదో ఉగ్రవాదిలా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో మానసికంగా వేధించడం తీవ్రంగా బాధించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో నిర్మాత అల్లు అరవింద్ 'కేజీఎఫ్కు ముందు యష్ ఎవరు?' అంటూ చేసిన వ్యాఖ్యలు 'టాక్సిక్' విడుదల తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఆమె తీవ్రంగా స్పందించారు. యష్ను కేవలం 'కేజీఎఫ్'తోనే గుర్తించడం సరైంది కాదని స్పష్టం చేశారు. 'కేజీఎఫ్' కంటే ముందే కన్నడ చిత్రసీమలో యష్ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి, తనకంటూ సొంత మార్కెట్, భారీ అభిమానగణాన్ని ఏర్పరుచుకున్న స్టార్ హీరో అని పుష్ప గుర్తుచేశారు.
ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టిన యష్, కేవలం తన స్వయంకృషితోనే ఈ స్థాయికి ఎదిగాడని ఆమె తెలిపారు. కన్నడ ఇండస్ట్రీలో ఆయన సాధించిన బాక్సాఫీస్ విజయాలే ఆయన స్టార్డమ్కు నిదర్శనమని, 'కేజీఎఫ్' లాంటి పాన్-ఇండియా ప్రాజెక్ట్లోకి వెళ్లడానికి ముందే ఆయన కర్ణాటకలో అగ్ర కథానాయకుడని పునరుద్ఘాటించారు.
'టాక్సిక్' సినిమా ఫలితాన్ని సాకుగా చూపి యష్ కెరీర్పై, ఆయన కష్టపడి సాధించుకున్న స్టార్డమ్పై జరుగుతున్న అసత్య ప్రచారాలకు తల్లి పుష్ప ఇచ్చిన స్పష్టతతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ వర్గాల నుంచి లేదా నిర్మాత అల్లు అరవింద్ నుంచి ఏమైనా స్పందన వస్తుందా? అనేది సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.











