హైదరాబాద్ను అంతర్జాతీయ క్రీడా పటంలో అగ్రస్థానంలో నిలిపేలా తెలంగాణ ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో రూపొందుతున్న ఈ ప్రపంచస్థాయి క్రీడా ప్రాంగణం కోసం అధికారులు ఇప్పటికే స్థల సేకరణ ప్రక్రియను వేగవంతం చేశారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది డిసెంబర్లోనే ఈ భారీ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియం 1,32,000 సీటింగ్ సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందగా, దానిని మించిపోయేలా ఫ్యూచర్ సిటీలో సుమారు 100ఎకరాల విస్తీర్ణంలో ఈ నూతన స్టేడియాన్ని నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా భూమిని కేటాయించనుండగా, స్టేడియం నిర్మాణంతో పాటు తదుపరి నిర్వహణ ఖర్చులన్నింటినీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భరించనుంది.
ప్రయాణికులు, అభిమానుల రవాణా సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఔటర్ రింగ్ రోడ్డు, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో లైన్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత సమీపంలో ఉండేలా స్థలాన్ని ఎంపిక చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న స్పోర్ట్స్ సిటీ, టూరిజం, నెట్ జీరో సిటీ కాన్సెప్ట్లో ఈ క్రీడా ప్రాంగణం ఒక ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
ఈ ప్రాంగణాన్ని కేవలం క్రికెట్ మ్యాచ్లకే పరిమితం చేయకుండా, అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నీలు, భారీ కాన్సర్ట్లు నిర్వహించడానికి వీలుగా మల్టీపర్పస్ వేదికగా తీర్చిదిద్దనున్నారు. అధునాతన మౌలిక వసతులతో నిర్మాణం కానున్న ఈ స్టేడియం హైదరాబాద్కే కాక మొత్తం తెలంగాణ రాష్ట్రానికే ఒక ఐకానిక్ ల్యాండ్మార్క్గా మారబోతోంది.









