తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి వర్షాభావ పరిస్థితుల కారణంగా అన్నదాతల సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన పర్యటన కొనసాగించింది. ఇవాళ కూడా ఆయన పర్యటనలో భాగంగా బయలు దేరగా.. ఆయన కాన్వాయ్ను కొందరు మహిళలు అడ్డుకున్నట్టు సమాచారం.
ఖమ్మం జిల్లా చింతకానిలో ఈ ఘటన జరిగింది. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కొందరు దళిత మహిళలు రోడ్డుకు అడ్డంగా వచ్చినట్టు సమాచారం. అదే సమయంలో అటుగా వస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్ను వారు అడ్డుకునేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. దళితులకు ఇస్తానని చెప్పిన మూడెకరాల భూమి ఇంకెప్పుడు ఇస్తారని మహిళలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన తెలిపినట్టు సమాచారం.
అయితే, భట్టి పర్యటనకు ముందే మహిళలు పెద్దఎత్తున ఆందోళనకు దిగినట్టు తెలుస్తోంది. దీంతో మహిళలను రోడ్డుపై నుంచి పోలీసులు చెదరగొట్టారు. కాగా, ఆందోళనకారులను కలవకుండానే భట్టి కాన్వాయ్ ముందుకు సాగినట్టు తెలిసింది.తమ సమస్యలు పట్టించుకోకుండా భట్టి వెళ్లిపోవడంపై ఆందోళన కారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో తమకు మూడెకరాల భూమి ఇస్తామని మాటిచ్చారని.. తీరా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీలు నెరవేర్చడం లేదని బాధిత మహిళలు మండిపడుతున్నారు.
తమకు న్యాయం చేసే వరకు పోరాటం ఆపబోమని దళిత కుటుంబాలకు చెందిన మహిళలు స్పష్టంచేశారు.కాగా, ఖమ్మం జిల్లాలో అన్నదాతలు,ప్రజలు రివర్స్ అవ్వడంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని, అయినా జిల్లాకు న్యాయం చేయలేకపోయారని సెటైర్లు వేసింది.రేవంత్ ప్రభుత్వంలో దోచుకోవడం,దాచుకోవడం ఆనవాయితీగా మారిందని, రైతులకు నీళ్లు, యూరియా సకాలంలో ఇవ్వడం లేదని.. ఆరు గ్యారెంటీలు పక్కకు పోయాయని ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
https://x.com/pulsenewsbreak/status/2094276808187523406?s=20












