తెలంగాణ

కొండాకు ఢిల్లీ పిలుపు..! రేవంత్‌ శిబిరం లెక్క ఏంటి?

రచన: Kashi9 నిమిషాల పఠనం

తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి చేరింది. సీఎం రేవంత్‌ శిబిరం ఢిల్లీ నుంచి ఏం కోరుకుంటోంది? అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఆ నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్‌లో ఎలాంటి సంకేతాన్ని ఇస్తుంది? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.

రాఖీతో రాజీ కుద‌ర‌లేదా..?

ఢిల్లీకి చేరిన కొండా ఇష్యూ

త్వ‌ర‌లో హ‌స్తిన‌కు సీఎం రేవంత్

హైక‌మాండ్ నిర్ణ‌యంపై ఉత్కంఠ‌

తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి చేరింది. సురేఖపై క్రమశిక్షణా కమిటీ చర్యకు సిఫార్సు చేసిన నేపథ్యంలో.. ఆమె రాజకీయ భవిష్యత్తుపై ఏఐసీసీ పెద్దలతో చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు ఢిల్లీకి వెళ్లనున్నట్లు వ‌స్తున్న వార్త‌లు సంచ‌ల‌నంగా మారాయి. సురేఖతో పాటు ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ జీ. చిన్నారెడ్డి అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని నేష‌న‌ల్ మీడియాలో కూడా వార్త‌లొస్తున్నాయి.

రేవంత్ శిబిరం టార్గెట్ ఏంటి..?

సీఎం రేవంత్‌ శిబిరం ఢిల్లీ నుంచి ఏం కోరుకుంటోంది? అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఆ నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్‌లో ఎలాంటి సంకేతాన్ని ఇస్తుంది? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.

సురేఖ కుమార్తె సుస్మితా పటేల్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లోనే పలువురు ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సురేఖ కూడా పార్టీ క్రమశిక్షణా కమిటీ ఎదుట వివరణ ఇచ్చారు. తన కుమార్తె వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని ఆమె వాదించారు. మరోవైపు ఎమ్మెల్యేలు మాత్రం సురేఖ తన కుమార్తె వ్యాఖ్యలను ఖండించాల్సిందని అన్నారు.

దీంతో వ్యవహారం క్రమంగా పెద్దదైంది. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ సురేఖ, జీ. చిన్నారెడ్డికి సంబంధించిన అంశాలను పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. కమిటీ పరిశీలించిన అంశాల్లో మీడియా వ్యాఖ్యలు, పార్టీకి అందిన ఫిర్యాదులు, నేతల వివరణలు కూడా ఉన్నాయని కమిటీ చైర్మన్‌ మల్లు రవి తెలిపారు. నివేదికను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు అందజేసి, ఏఐసీసీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రక్రియ ప్రారంభమైంది.

అక్కడే అసలు ట్విస్ట్‌

రాష్ట్ర స్థాయిలో క్రమశిక్షణా కమిటీ తన పని పూర్తి చేసింది. ఇప్పుడు బంతి ఢిల్లీ కోర్టులో ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కూడా తుది నిర్ణయం ఏఐసీసీదేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా పార్టీ క్రమశిక్షణా వ్యవస్థనే ఈ వ్యవహారాన్ని చూసుకుంటుందని, తుది నిర్ణయం అధిష్ఠానానిదేనని గతంలో చెప్పారు.

అయితే ఇప్పుడు రేవంత్‌రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లనుండటంతో రాజకీయ ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది. అసలు రేవంత్‌ శిబిరం లెక్క ఏంటి? ఇదే ఇప్పుడు కీలకమైన ప్రశ్న.

రాష్ట్రంలో ఇప్పటికే ఒక సందేశం వెళ్లింది. ముఖ్యమంత్రి మీద బహిరంగంగా విమర్శలు చేయడం, పార్టీ అంతర్గత విషయాలను బహిరంగ వేదికపైకి తీసుకురావడం సహించబోమన్న సంకేతం కనిపించింది. పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా సురేఖపై చర్యలు తీసుకోవాల‌ని కోరారు.

అలాంటి సమయంలో క్రమశిక్షణా కమిటీ సిఫార్సు చేసిన తర్వాత కూడా ఎలాంటి చర్య లేకపోతే.. పార్టీ లోపల మరో చర్చ మొదలయ్యే అవకాశం ఉంది.

క్రమశిక్షణ అంటే ఎవరికి?

రాష్ట్ర నాయకత్వం తీసుకున్న వైఖరికి ఢిల్లీ ఎంతవరకు మద్దతు ఇస్తోంది? దీనిపై కాంగ్రెస్‌లో ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయ‌ట‌. అందుకే రేవంత్‌ శిబిరానికి ఈ ఢిల్లీ పర్యటన కేవలం ఒక మంత్రిపై నిర్ణయం కోసం జరిగే భేటీ కాదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు అధిష్ఠానానికి కూడా ఇది అంత సులభమైన నిర్ణయం కాదు. కొండా సురేఖ సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు. ఆమెపై చర్య తీసుకోవడం అంటే ఒక వ్యక్తిపై క్రమశిక్షణా చర్య తీసుకోవడంతో వ్యవహారం ముగిసిపోతుందని చెప్పలేం. ఆ నిర్ణయం తర్వాత పార్టీ అంతర్గత సమీకరణాలు ఎలా మారతాయి? అన్నది కూడా ఢిల్లీ ఆలోచించాల్సిన అంశమే.

ఇదే కారణంగా “వేటు”తో పాటు “రాజీ” అనే ఆప్షన్‌ కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది. అయితే దీనిపై అధికారిక నిర్ణయం మాత్రం హైక‌మాండ్‌దే. ఇక ఈ వివాదం మధ్య జరిగిన మరో పరిణామం కూడా ఆసక్తికరమే.

రక్షాబంధన్‌ సందర్భంగా కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి రాఖీ కట్టారు. క్రమశిక్షణా వివాదం కొనసాగుతున్న సమయంలో జరిగిన ఈ భేటీ సహజంగానే రాజకీయ చర్చకు దారితీసింది. కొందరు దీన్ని రాఖీ డిప్లొమసీగా అభివర్ణించారు.

కానీ వ్యక్తిగత ఆత్మీయత ఒకటి.. పార్టీ క్రమశిక్షణ మరోటి. అందుకే అసలు ఇష్యూ ఇంకా అలాగే ఉంది. రాఖీతో రచ్చకు బ్రేక్‌ పడిందా? లేక ఢిల్లీ నిర్ణయం వచ్చే వరకు మాత్రమే వివాదం ఆగిందా? ఇప్పుడు ఢిల్లీ సమావేశాలే దీనికి సమాధానం చెప్పాలి.

సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు ఢిల్లీలో కీలక సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉందని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇది నిజంగా కీలక పరిణామమే. ఒకవేళ సురేఖపై కఠిన చర్య వస్తే.. రేవంత్‌ శిబిరం తన వైఖరిని నెగ్గించుకున్నట్టేనా? అన్న చర్చ మొదలవుతుంది. చర్య తీసుకోకపోతే.. రాష్ట్ర నాయకత్వం కోరుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ ఎందుకు ఆపింది? అన్న ప్రశ్న వస్తుంది.

అదే సమయంలో ఒక రాజీ ఫార్ములా వస్తే.. అది ఇద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలను సద్దుమణిగించగలదా? లేక కొంతకాలం తర్వాత మళ్లీ ఇదే రచ్చ తెరపైకి వస్తుందా? అన్నది చూడాలి.

అందుకే ఇప్పుడు కొండా సురేఖ ఎపిసోడ్‌ క్లైమాక్స్‌ హైదరాబాద్‌లో కాదు.. ఢిల్లీలోనే అనేది సుస్ప‌ష్టం. రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ తన నివేదిక ఇచ్చింది. సురేఖ తన వాదన వినిపించారు. ఎమ్మెల్యేలు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాఖీ భేటీతో వ్యక్తిగతంగా సాన్నిహిత్యానికి సంకేతం కనిపించింది. కానీ రాజకీయ సమస్య మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు.

ఫైన‌ల్‌గా కొండాకు ఢిల్లీ పిలుపు.. వేటు కోసమా? రాజీ కోసమా? చివరికి నెగ్గేది రేవంత్‌ శిబిరం లెక్కా.. లేక అధిష్ఠానం లెక్కా? ఇదే తేలాల్సిన అంశం.

#Konda Surekha#Revanth Reddy#Telangana Congress#Telangana Politics#Congress High Command#Konda Surekha News#Revanth Reddy News#Telangana News#Congress Crisis#Telangana Political News#Hyderabad Politics#Delhi Meeting#Telangana Cabinet#Political Analysis
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి