దేశవ్యాప్తంగా సాగుతున్న పరీక్షల వివాదాలు, విద్యార్థుల ఆందోళనల నడుమ పుట్టుకొచ్చిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP)పై ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నూతన ఉద్యమ పార్టీ ఆవిర్భావం కేంద్రంలో అధికారంలో ఉన్న భారత్ జనతా పార్టీ (బీజేపీ)కి తీవ్ర రాజకీయాన్ని మిగల్చబోతోందని ఆయన అంచనా వేశారు. ఆ పార్టీ గ్రహస్థితులు, కుండలి బలంగా ఉన్నాయని.. రాబోయే రోజుల్లో ఇది అధికార పక్షానికి పెద్ద సవాలుగా పరిణమించే అవకాశం ఉందని విశ్లేషించారు.
ఇటీవల సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ యువతను ఉద్దేశించి చేసిన 'బొద్దింకలు' వ్యాఖ్యకు నిరసనగా ఈ ఉద్యమం రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. బోస్టన్లో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న అభిజీత్ దీప్కే అనే విద్యార్థి నాయకత్వంలో రూపుదిద్దుకున్న ఈ ఉద్యమం, ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రధాన డిమాండ్గా తెరపైకి తెచ్చింది.
కాక్రోచ్ జనతా పార్టీ జాతకాన్ని విశ్లేషించిన వేణుస్వామి.. ఆ పార్టీ కుండలిలో 'బుధాదిత్య యోగం', 'కాలసర్ప రాజయోగం' ఉన్నాయని తెలిపారు. వీటి ప్రభావం వల్ల ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ ఉద్యమానికి విపరీతమైన ప్రజాదరణ లభిస్తుందని పేర్కొన్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం బలవంతంగా ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తే, అది మరింత తీవ్రమై అంతిమంగా బీజేపీకే పెద్ద దెబ్బగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ ఉద్యమ ఫలితంగా జరిగే మొత్తం రాజకీయ నష్టంలో 90 శాతం ఒక్క బీజేపీయే భరించాల్సి వస్తుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయక తప్పదని, అదే సమయంలో సీజేపీకి చెందిన ముగ్గురు కీలక నేతలు జైలుకు వెళ్లాల్సి రావచ్చునని తన జోస్యంలో వెల్లడించారు.
జాతకాలు, గ్రహబలాలు అంటూ సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరి భవిష్యత్తుపై జ్యోతిష్యం చెప్తూ తరచూ వార్తల్లో నిలిచే వివాదాస్పద జ్యోతిష్కుడు వేణు స్వామి. సినిమా తారల వ్యక్తిగత జీవితాలు, పెళ్లిళ్లు, రాజకీయనాయకుల గెలుపోటములపై ఆయన చేసే సంచలన కామెంట్స్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటాయి. కొందరు ఆయన చెప్పే జోస్యాలను నమ్మితే, మరికొందరు పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేస్తారు. ఏది ఏమైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ నిత్యం చర్చల్లో నిలవడం మాత్రం ఆయనకే చెల్లింది.












