Abhijeet Dipke: నీట్ పేపర్ లీక్ ను నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు ఉధృతం కావడంతో.. నీట్ పేపర్ లీక్ కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే స్పందించారు. మనం సాధించాము, ధర్మేంద్ర రాజీనామా చేశారని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో అసలైన ప్రక్షాళన ఇప్పుడే మొదలైందని వ్యాఖ్యానించారు.
నిరసనకారులకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. భయపడకుండా పోరాడితే విజయం తథ్యమని రుజువైందన్నారు. తమను బొద్దింకలు అన్న సీజేఐ సూర్యకాంత్ కు ధన్యవాదాలు తెలిపారు దీప్కే. బొద్దంకలు అని సీజేఐ అనకుంటే ధర్మేంద్ర రాజీనామా సాధ్యమయ్యేది కాదన్నారు.
ఈ విజయం విద్యార్ధులు అందరిదీ అని కాక్రోచ్ జనతా పార్టీ నేతలు అన్నారు. ఈ పోరాటంలో విద్యార్థులు విజయం సాధించారని చెప్పారు. రాజీనామా డిమాండ్ నెరవేరిందన్నారు. అయితే, తమ పోరాటం ఇంకా పూర్తవ్వ లేదని, మిగతా డిమాండ్లు కూడా నెరవేరే వరకు వేచి ఉందామన్నారు.
నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై పెట్టిన అన్ని కేసులు ఎత్తివేయాలని సీజేపీ నేతలు తేల్చి చెప్పారు. అలాగే నీట్ పేపర్ లీక్ తో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలన్నారు.
ప్రజాస్వామ్యం అంటే ఇదే.. విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేవరకు ఈ ఉద్యమం ఆగదని సీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఈ విజయోత్సవ వేళ సాయంత్రం 6 గంటలకు దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని సీజేపీ నేతలు పిలుపునిచ్చారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల ఆత్మశాంతి కోసం కొవ్వొత్తుల ర్యాలీ చేయాలన్నారు. తమకు రాజకీయాలు అవసరం లేదన్నారు. ధర్మేంద్ర రాజీనామా తమకు దక్కిన గొప్ప విజయంగా అభివర్ణించారు. కాక్రోచ్ లు వ్యవస్థలోని చీడ పురుగులను బయటకు పారదోలాయి అని అన్నారు. ఇది దేశ యువత, విద్యార్థులు, ప్రజాస్వామ్య విజయం అని చెప్పారు.
ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి..












