సోషల్ మీడియా వేదికగా భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణికి సంబంధించి వైరల్ అవుతున్న ఒక వీడియోపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. న్యూఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనలకు మద్దతుగా సుమారు 30వేల మంది భారతీయ సైనికులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారని, ప్రభుత్వం విద్యార్థుల పట్ల సానుకూల వైఖరి వహించాలని సీడీఎస్ అన్నట్లుగా సదరు వీడియోలో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని, అదంతా తప్పుడు ప్రచారమని కేంద్రం స్పష్టం చేసింది.
ఈ విషయంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం ప్రత్యేకంగా స్పందిస్తూ అసలు నిజాలను వెల్లడించింది. పాకిస్థాన్కు చెందిన ప్రచార ఖాతాలు కృత్రిమ మేధ (AI) సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ఈ నకిలీ (Deepfake) వీడియోను సృష్టించాయని తేల్చింది. సీడీఎస్ జనరల్ రాజా సుబ్రమణి జంతర్మంతర్ ఆందోళనలకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు చేయలేదని, సైనికుల రాజీనామాల వార్త పూర్తిగా అవాస్తవమని పీఐబీ ధ్రువీకరించింది.
ప్రజల్లో గందరగోళాన్ని నివారించడానికి పీఐబీ ఒరిజినల్ వీడియోను కూడా విడుదల చేసింది. నిజానికి ఆ వీడియో 'ఇండియన్ ఆయిల్ దురాండ్ కప్' ఫుట్బాల్ టోర్నమెంట్కు ప్రజలను ఆహ్వానిస్తూ సీడీఎస్ మాట్లాడిన సందేశానికి సంబంధించినది. సదరు ఒరిజినల్ వీడియోలోని దృశ్యాలను సేకరించి, ఏఐ సాయంతో తప్పుడు ఆడియోను క్లోనింగ్ చేసి జోడించడం ద్వారా ఈ తరహా దుష్ప్రచారానికి ఒడిగట్టారని పీఐబీ వివరించింది.
సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందే ఇటువంటి అనుమానాస్పద, సంచలనాత్మక వీడియోలను ప్రజలు ప్రాథమిక పరిశీలన లేకుండా నమ్మవద్దని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఏదైనా అధికారిక సమాచారాన్ని కేవలం ప్రభుత్వ గుర్తింపు పొందిన మూలాల ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఎలాంటి నకిలీ వార్తలు లేదా మానిప్యులేటెడ్ కంటెంట్ కనిపిస్తే వెంటనే వాట్సాప్ (+91 8799711259) లేదా ఈమెయిల్ (factcheck@pib.gov.in) ద్వారా పీఐబీ ఫ్యాక్ట్ చెక్ బృందానికి ఫిర్యాదు చేయాలని కోరింది.












