పశ్చిమాసియాలో గత ఆరు నెలలుగా కొనసాగుతున్న సంక్షోభంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్లోని ఇంధన, సైనిక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా చేపట్టాలనుకున్న భారీ సైనిక దాడిని అమెరికా విరమించుకుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడిస్తూ, ఇరు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించేందుకు నేటి (ఆగస్టు 3) నుంచి కొత్త దౌత్యపరమైన చర్చలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ట్రంప్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంతో అంతర్జాతీయంగా నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు కొంతవరకు తగ్గుముఖం పట్టాయి.
ఈ నూతన చర్చల్లో ప్రధానంగా వ్యూహాత్మకంగా కీలకమైన 'హర్మూజ్ జలసంధి' లో నౌకల రాకపోకల వివాదం, ఇరాన్ అణు నిరాయుధీకరణ అంశాలపై దృష్టి సారించనున్నట్లు ప్రెసిడెంట్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా చర్చలకు మార్గం సుగమమవ్వడంతో ఆసియా మార్కెట్లలో అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.
వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) బ్యారెల్ ధర 4.7 శాతం తగ్గి 80.72 డాలర్లకు చేరుకుంది. ఇటీవలే దాడులు పునరుద్ధరణ కావడంతో ప్రాంతీయ యుద్ధ భయాలు తీవ్రమయ్యాయి. ఇరాన్పై అత్యంత కఠినమైన చర్యలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించినప్పటికీ, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ వంటి గల్ఫ్ మిత్రదేశాల విజ్ఞప్తుల నేపథ్యంలో ఆయన మెట్టు దిగారు. మరోవైపు, తమ విజ్ఞప్తి మేరకే దాడి ఆపారన్న అమెరికా వ్యాఖ్యలను ఇరాన్ మీడియా ఖండించినప్పటికీ, మధ్యవర్తుల ద్వారా దౌత్య చర్చలను పునరుద్ధరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా "కుదిరిన ఒప్పందాలకు శత్రుదేశం కట్టుబడి ఉండేలా చూడటమే మన ముందున్న ప్రధాన లక్ష్యం" అని పేర్కొన్నారు. చర్చల పురోగతి సాధిస్తున్నప్పటికీ ప్రాంతీయ భద్రతాపరమైన ఆందోళనలు పూర్తిగా వీడలేదు. ఆదివారం ఒమన్ తీరం సమీపంలో పేలుడు సంభవించినట్లు యూకేఎంటీవో యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) ధృవీకరించింది. మరి ఈ కొత్త చర్చల ద్వారా అయినా ప్రాంతీయ శాంతి చేకూరుతుందో లేదో రాబోయే రోజుల్లో స్పష్టం కానుంది.












