రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది. తనకు ఏ పాపం తెలియదని.. కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారనే ఆరోపణలు చేసిన ఆయన లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతూ విస్తూపోయేలా చేస్తున్నాయి.. తాజాగా పోలీసులు దర్యాప్తులో ఉదయ్ కృష్ణారెడ్డికి మరో మహిళతోనూ సన్నిహిత సంబంధాలున్నాయని అధికారులు గురించినట్టు సమాచారం..
ఓ ట్రైనీ మహిళా ఐపీఎస్ తనపై లైంగిక వేధింపులకు ఉదయ్ పాల్పడ్డాడని ఇచ్చిన ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నగర మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్యనాయక్ జాదవ్ దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ఇక బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన అధికారులు కీలక ఆధారాలు రాబట్టినట్లు తెలిసింది.
సీన్ రీ-కన్స్ట్రక్షన్లో భాగంగా పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డి గదిని తనిఖీ చేసి ల్యాప్టాప్, సెల్ఫోన్, రెండు ప్రేమలేఖలు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ప్రేమలేఖల ఆధారంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ వివాహిత మహిళతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. 2023 నుంచి భర్తకు దూరంగా ఉంటున్న ఆమె, ఉదయ్ పరిచయం తర్వాత హైదరాబాద్లో ఉద్యోగం మారినట్లు సమాచారం. లివ్-ఇన్ రిలేషన్ ప్రతిపాదనను చట్టబద్ధమైన విడాకులు లేకపోవడంతో ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై పోలీసులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.
మరోవైపు ఈ కేసులో పోలీసులు సుమారు 20 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించినట్లు సమాచారం. మరోవైపు మహిళా ట్రైనీ ఐపీఎస్ గదిలోకి బలవంతంగా చొరబడిన నిందితుడు ఆమె ఫోన్ లాక్కున్నమాట వాస్తవమేనని ఆధారాలు సేకరించారు. ఉదయ్ కృష్ణారెడ్డి అతి కోపం, విపరీత ప్రవర్తనవల్ల శిక్షణలో కొంతమంది మనోవేదన పడినట్టు సమాచారం. నిందితుడిని కస్టడీకి తీసుకొని మరికొన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు సిద్ధమైనట్టు తెలుస్తుంది.












