భక్తుల ఆధ్యాత్మిక అనుభూతికి ఎలాంటి అంతరాయం కలగకుండా.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కొండపై శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు నో హారన్ నిబంధనను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. అనవసరంగా హారన్ మోగించే వాహనదారులపై చర్యలు తీసుకునేందుకు సిద్దం అవుతుంది. ఈ పుణ్య క్షేత్రంలో నిత్యం రద్దీతో పాటు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
ప్రతి చిన్న విషయానికీ వాహనదారులు హారన్ మోగించడంతో.. ప్రశాంతమైన ఏడు కొండల్లో శబ్ద కాలుష్యం పెరుగుతోంది. దీనివల్ల భక్తుల ఆధ్యాత్మిక అనుభూతికి ఆటంకం కలగడమే కాకుండా.. తిరుమల అడవుల్లోని వన్యప్రాణులపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోంది. అందుకే.. తిరుమలలో అనవసర హారన్కు చెక్ పెట్టాలని అధికారులు నిర్ణయించారు..
ఈ నేపథ్యంలో తిరుమలను సైరన్ జోన్గా ప్రకటించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసింది. జీఎన్సీ టోల్గేట్ నుంచి తిరుమల వ్యాప్తంగా, రెండు ఘాట్ రోడ్లలో ఈ నిబంధన అమలవుతుంది. అయితే ఈ నిబంధనలు ఎప్పటి నుండో అమలులో ఉన్నప్పటికీ అంబులెన్స్లు, వీవీఐపీల ప్రొటోకాల్ వాహనాలు సైరన్లు అవసరమైతే తప్ప మోగించ రాదని ఆంక్షలు విధించింది.
మరోవైపు ఈ నిబంధనల అమలుకోసం ట్రాఫిక్ పోలీసులు, జిల్లా రవాణాశాఖ అధికారులు తరచూ ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. మోటారు వాహన చట్టంలో అనుమతించిన డెసిబుల్స్ పరిమితిని మించి శబ్దం చేసే వాహనాలు, సైలెన్సర్లు ఉపయోగించడం నేరంగా పరిగణించి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో గత ఆరునెలల్లో శబ్ద కాలుష్యాన్ని సృష్టించిన 42 వాహనాలపై కేసు నమోదు చేసి రూ.64,475 జరిమానా వసూలు చేసినట్టు తిరుమల ట్రాఫిక్ సీఐ హరిప్రసాద్ వెల్లడించారు. అలాగే రెండువేలకుపైగా సీసీ కెమెరాల ద్వారా పోలీస్ కమాండ్ కంట్రోల్ విభాగం నిరంతరం పర్యవేక్షిస్తుందని నిబంధనలు ఉల్లంఘించే వారికి జరిమానాలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు..












