TG : తెలంగాణ రాజకీయాల్లో గత రెండు రోజులుగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజు విపక్షాల నిరసనలతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సమయంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలను మార్చేశాయి. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయబోతున్నారనే ప్రచారం మంగళవారం తీవ్ర చర్చకు దారితీసింది.
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను దూషించారనే ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి ముందుగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి, దానిని ఆమోదించిన అనంతరం మండలి ఛైర్మన్కు పంపి అనర్హత వేటు వేయించే వ్యూహం రూపొందించినట్లు ప్రచారం జరిగింది.
అయితే ఇక్కడే అసలు న్యాయపరమైన ప్రశ్న తెరపైకి వచ్చింది. రాజ్యాంగపరంగా శాసనసభ, శాసనమండలి రెండూ స్వతంత్ర సభలు. ఒక సభకు మరో సభ సభ్యుడిపై నేరుగా అనర్హత వేటు వేసే అధికారం లేదు. దీంతో అసెంబ్లీ తీర్మానం ద్వారా ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటించే ప్రయత్నం రాజ్యాంగపరంగా నిలబడదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
సభ్యుల అనర్హతకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 191లో నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయి. పార్టీ ఫిరాయింపుల విషయంలో సంబంధిత సభ స్పీకర్ లేదా మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవచ్చు. ఇతర అనర్హతల విషయంలోనూ రాజ్యాంగం నిర్దేశించిన ప్రత్యేక ప్రక్రియ ఉంటుంది. కేవలం సభ తీర్మానం ఆధారంగా మరో సభ సభ్యుడిపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చి, అనర్హతకు బదులుగా ఎమ్మెల్సీలను సభ నుంచి సస్పెండ్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సభా క్రమశిక్షణ ఉల్లంఘనకు సంబంధించి సభ్యులను సస్పెండ్ చేసే అధికారం సభకు ఉంటుంది.
మొత్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అనర్హత వేటు అంశం రాజకీయాల్లో హీట్ పెంచేసింది. చివరకు సస్పెన్షన్తోనే వ్యవహారం ముగిసినట్లు కనిపిస్తోంది. రాజకీయంగా ఎంత దూకుడు ఉన్నా.. రాజ్యాంగపరమైన పరిమితులు, చట్టపరమైన విధానాలు కీలకమని ఈ పరిణామం మరోసారి స్పష్టం చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












