BJP: తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఓ కార్యక్రమం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. సాధారణంగా రాజకీయ నాయకులు కలిసి మాట్లాడుకోవడం, కార్యక్రమాల సందర్భంగా ఒకే టేబుల్ వద్ద కూర్చొని టిఫిన్ చేయడం సర్వసాధారణం. కానీ ఈ సోషల్ మీడియా యుగంలో ఇలాంటి దృశ్యాలు కూడా రాజకీయ విమర్శలకు కారణమవుతున్నాయి. తాజాగా అసెంబ్లీ సెంట్రల్ హాల్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన బ్రేక్ఫాస్ట్ వ్యవహారం ఇదే పరిస్థితిని తెచ్చిపెట్టింది.
తెలంగాణ అసెంబ్లీ సెంట్రల్ హాల్ను సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బీజేపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం అక్కడే అందరికీ టిఫిన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.
సీఎంతో బీజేపీ ఎమ్మెల్యేల బ్రేక్ఫాస్ట్పై విమర్శలు
కాంగ్రెస్ సీఎంతో కలిసి కాషాయ పార్టీ ఎమ్మెల్యేలు టిఫిన్ చేయడంపై సోషల్ మీడియాలో కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. బయట ప్రజా సమస్యలపై ఆందోళనలు, అధికార పార్టీపై విమర్శలు చేస్తూ.. లోపల మాత్రం ముఖ్యమంత్రితో కలిసి టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్ చేయడమేంటని ప్రశ్నలు సంధిస్తున్నారు.
ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యేల బ్రేక్ఫాస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ చర్చ మరింత పెరిగింది. అధికార పార్టీతో కమలం పార్టీ నాయకులు కుమ్మక్కయ్యారంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు.
పార్టీ పెద్దలకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి
ఈ వ్యవహారంపై రాష్ట్ర బీజేపీ పెద్దలను ఢిల్లీ నాయకులు వాకబు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ వాళ్లతో కలిసి మన వాళ్లు ఎందుకు కూర్చున్నారు? అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా ఉండాల్సిందా? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరు కాలేదని, మరి మన ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లారంటూ కూడా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. దీంతో అసెంబ్లీ లోపల, బయట తాము చేపట్టిన రాజకీయ కార్యక్రమాల కంటే.. బ్రేక్ఫాస్ట్ ఫొటోలపై వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కొందరు బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే బ్రేక్ఫాస్ట్కు హాజరైన బీజేపీ ఎమ్మెల్యేల వాదన మాత్రం మరోలా ఉంది. రాజకీయాలు రాజకీయాలేనని, కానీ అసెంబ్లీ సెంట్రల్ హాల్ వంటి అధికారిక కార్యక్రమానికి హాజరైనప్పుడు అక్కడ ఏర్పాటు చేసిన విందులో పాల్గొనడం తప్పేమిటని వారు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై, అక్కడ ఏర్పాటు చేసిన టిఫిన్ చేయకుండా వెళ్లడం సరైన సంప్రదాయం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా తమ మెడలో బీజేపీ కండువాలు అలాగే ఉన్నాయని, పార్టీ విధానాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్లో చేరినట్లు వ్యవహరించలేదని వారు వివరణ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
కుర్చీలు లేకపోవడంతోనే సీఎం టేబుల్ వద్దకు..
ఇక బ్రేక్ఫాస్ట్ సమయంలో సీఎం టేబుల్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు కూర్చోవడంపై కూడా వివరణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ హాల్లో కుర్చీలు అందుబాటులో లేకపోవడంతోనే సీఎం టేబుల్ వద్దకు వెళ్లాల్సి వచ్చిందని, మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేయడంతో అక్కడ కూర్చున్నామని బీజేపీ ఎమ్మెల్యేలు చెబుతున్నట్లు సమాచారం.
బయట రాజకీయ ఆందోళనలు ప్రారంభం కాకముందే బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం పూర్తయిందని కూడా వారు వివరణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని బీఆర్ఎస్ అనుకూల వర్గాలు ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.
మొత్తంగా చూస్తే.. అసెంబ్లీ సెంట్రల్ హాల్ ప్రారంభోత్సవంలో జరిగిన సాధారణ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు కేంద్రంగా మారింది. రాజకీయ ప్రత్యర్థులు ఒకే వేదికపై కనిపించడం, కలిసి మాట్లాడుకోవడం, కలిసి భోజనం చేయడం కూడా సోషల్ మీడియాలో కొత్త అర్థాలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఘటన సోషల్ మీడియా యుగంలో రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఎంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుందో మరోసారి చర్చకు తెచ్చింది.









