Tirumala: ఎల్ నినో తీవ్రమైన ప్రభావమే చూపిస్తోంది. ఎల్ నినో కారణంగా సకాలంలో వర్షాలు కురవకుండా పోయాయి. దీంతో చాలా ప్రాంతాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలపైనా పడింది. తిరుమలలో నీటి కష్టాలు తప్పడం లేదు. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోయాయి. దీంతో టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు. నీటి పొదుపు చర్యలు చేపట్టారు.
నీటి పొదుపు చర్యలు
తిరుమలలోని రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మఠాలపై ఆంక్షలు విధించారు. రోజుకు నాలుగు గంటలు మాత్రమే నీటిని విడుదల చేస్తామని టీటీడీ అధికారులు ప్రకటించారు. ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు మాత్రమే నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. ప్రస్తుతం తిరుమల అవసరాల కోసం ప్రతిరోజు 56 లక్షల గ్యాలన్ల నీటి వినియోగం జరుగుతోంది.
పాప వినాశనం, గోగర్భం డ్యామ్, కుమారధార, పసుపుధార, ఆకాశ గంగ జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గాయి. ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీరు 4 నెలలకు మాత్రమే సరిపోతుందని టీటీడీ అధికారులు అంచనా వేశారు. రాబోయే రోజుల్లో వర్షాలు పడకుంటే మరిన్ని ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు అధికారులు.
మరో 4 నెలలకు మాత్రమే సరిపోయేంత నీరు
వర్షాకాలం వచ్చినా వానలు కురవడం లేదు. దీంతో తిరుమలలోని జలాశయాలన్నీ అడుగంటిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీరు మరో మూడు లేదా నాలుగు నెలల కాలానికి మాత్రమే సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురవాల్సిన కాలంలోనూ ఎండలు మండిపోతున్నాయి. తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. మరోవైపు ఎండల తీవ్రతతో నీరు వేగంగా ఆవిరైపోతోంది.
రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మఠాలపై ఆంక్షలు
ఓవైపు వానలు కురవడం లేదు, మరోవైపు నీరు ఆవిరి కావడం.. దీంతో జలాశయాల్లో నీటి నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. నీటి ఎద్దడి నివారణ కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది టీటీడీ. ఇందులో భాగంగా నీటి పొదుపు చర్యలు చేపట్టింది. తిరుమలలో ఉన్న మఠాలు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు.. వీటన్నింటికి తిరుమల జలాశయాల నుంచే నీటిని వదులుతున్నారు. ఇకపై వీటికి రోజుకు 4 గంటలు మాత్రమే నీటి వదులుతామని అధికారులు తెలిపారు. ముందు ముందు వానలు పడకపోతే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
రోజుకు 56లక్షల గ్యాలన్ల నీటి వినియోగం
మరోవైపు తిరుపతిలోని కల్యాణి డ్యామ్ నుంచి కూడా తిరుమలకు నీటి సరఫరా జరుగుతోంది. అయితే, అక్కడ కూడా నీరు అడుగంటిపోయే పరిస్థితి ఉంది. నిత్యం 80వేల నుంచి లక్ష మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. రోజుకు 56 లక్షల గ్యాలన్ల నీటిని తిరుమలలో వినియోగిస్తున్నారు. ఈ లెక్కన ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీరు మరో మూడు లేదా నాలుగు నెలల కాలానికి మాత్రమే సరిపోతుందని అంచనా వేశారు. మరోవైపు వర్షాలు సమృద్ధిగా కురవాలని ఇటీవలే టీటీడీ వరుణ యాగం కూడా చేసింది.










