బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరో బిగ్షాక్ తగిలింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజున జరిగిన తీవ్ర ఉద్రిక్తతే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు మండలి నుంచి సస్పెండ్ అయ్యారు. అలాగే శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం సస్పెన్షన్కు గురయ్యారు.
కాసేపటి క్రితం మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా మరో ఇద్దరు ఎమ్మెల్యేల మీద లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఓ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు ఫైల్ చేసినట్టు సమాచారం. ఇదిలాఉండగా, తాజాగా కేటీఆర్ పీఆర్ఓ, పీఏ మీద కూడా కేసు నమోదైంది. సెషన్స్ ప్రారంభం రోజున అసెంబ్లీ గేట్ నంబర్-3 వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. వారిని సభలోకి పంపించకపోవడంపై పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్లకార్డులు,బ్లాక్ దుస్తులు వేసుకుని అసెంబ్లీకి వెళ్లొద్దని పోలీసులు చెప్పడంతో మీరు ఎవరు చెప్పడానికి అంటూ బీఆర్ఎస్ నేతలు వారితో వాగ్వాదం పెట్టుకున్నారు. అది కాస్త శృతి మించడంతో పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణల నేపథ్యంలో అందుకు బాధ్యులను చేస్తూ కేటీఆర్ పీఆర్ఓ మహేష్, పీఏ మహేందర్ రెడ్డిపైనా కేసు ఫైల్ చేశారు. ఆ సమయంలో వారు కూడా నిరసనల్లో పాల్గొన్నట్టు సమాచారం. దీంతో వారి మీద కూడా పోలీసులు కేసు ఫైల్ చేయడంతో బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తల్లిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి దూషించడంతో వారిని శాసనమండలి నుంచి సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిందే.తన తల్లిని దూషించారని నిండు సభలో స్పీకర్ కంటతడి పెట్టారు. దీంతో సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పీకర్కు భరోసానిచ్చారు. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు ఎమ్మెల్సీల సభ్యత్వాలను కూడా రద్దు చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్టు సమాచారం. అందుకే ఎథిక్స్ కమిటీకి ఆ ఇద్దరు ఎమ్మెల్సీల ప్రవర్తనపై ఫిర్యాదు చేయగా.. ప్రస్తుతం విచారణ జరగుుతున్నట్టు తెలుస్తోంది.స్పీకర్ తల్లిని దూషించిన ఘటనపై ఎథిక్స్ కమిటీ సైతం ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. పూర్తి విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని తెలిసింది.












