Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 7న ఉదయం 10 గంటల నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ అధికారులు సమాచారం ఇచ్చారు.
వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. గత బీఆర్ఎస్ పదేళ్ల పాలన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై సభలో చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ సవాల్ విసిరారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాలకు రావాలని, చర్చలో పాల్గొనాలని పదే పదే డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఆర్థిక పరిస్థితి, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలపై ఈ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. అటు సర్కార్ ను టార్గెట్ చేసేందుకు ప్రతిపక్షాలు ప్రణాళిక రచిస్తున్నాయి. ప్రజా సమస్యలు, రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై రేవంత్ సర్కార్ ను నిలదీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ సమాయత్తమవుతున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల జాబితా అంశం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచేసింది. 22ఏ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. 22ఏ భూ బాధితులకు ప్రతిపక్షాలు అండగా నిలుస్తున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ సమాయత్తమవుతోంది. అలాగే కృష్ణా, గోదావరి జలాలు వినియోగం అంశంపైనా వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది.
కాగా, సమావేశాలు ఎన్ని రోజుల నిర్వహిస్తారు అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. తొలి రోజు సభ ముగిశాక నిర్వహించే బీఏసీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.












