తొలిపూజలందుకునే ఆదిదేవుడు, విఘ్న నివారకుడు శ్రీ వినాయకుని జన్మదినమే వినాయక చవితి.. సృష్టిలోని జ్ఞానానికి, బుద్ధికి, వివేకానికి ప్రతీకగా ఆరాధించే దైవతత్వం. అందుకే ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా ముందుగా గణనాథుడిని స్మరించడం మన సనాతన సంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆచారం..
మన జీవితంలో ఎదురయ్యే విఘ్నాలను తొలగించడంతో పాటు.. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, అహంకారం నుంచి వినయం వైపు మనలను నడిపించమని గణపతిని ప్రార్థించే పవిత్ర సందర్భం వినాయక చవితి...
అందుకే గణపతి పండుగ రోజు చేసే ప్రతి పని వెనుక ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంటుందని చెబుతారు. అదే సమయంలో కొన్ని పనులను చేయకూడదని పెద్దలు పేర్కొంటారు. ముఖ్యంగా.. పూజ జరుగుతున్న సమయంలో కోపం, కలహాలు, ఇతరులను నిందించడం వంటివాటికి దూరంగా ఉండాలని అంటారు..
ఎందుకంటే గణపతి ఆరాధనలో దేవుడి ముందు వెలిగించే దీపం కంటే.. మనసులో వెలిగే సద్బుద్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అలాగే పూజను కేవలం ఒక ఆచారంలా ముగించకుండా.. కొద్దిసేపైనా ధ్యానం, నామస్మరణ, ప్రార్థనలో గడపడం మంచిదని అంటారు.
ఇక పూజ అనంతరం నైవేద్యాన్ని భక్తితో సమర్పించి, ప్రసాదాన్ని గౌరవంగా స్వీకరించాలి.. అలాగే ప్రకృతికి హాని కలిగించే రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలు ఉపయోగించకుండా పర్యావరణహితమైన విధానాలను ఎంచుకోవడం కూడా గణపతి ఆరాధనలోని ప్రకృతి మనం ఇచ్చే గౌరవంగా భావిస్తారు.
ముఖ్యంగా.. గణపతి పండుగను ఆడంబరంగా ప్రదర్శించుకోవడం కంటే.. మనలోని కోపం, అసూయ, అహంకారం, అజ్ఞానం అనే విఘ్నాలను తొలగించుకోవడమే అసలైన భక్తిగా చెబుతారు. కాబట్టి ఈ వినాయక చవితికి ఇంట్లో గణపతిని ప్రతిష్ఠించడంతో పాటు.. మన హృదయంలో కూడా సద్బుద్ధిని ప్రతిష్ఠించుకుందాం. అదే గణనాథుని పూజకు నిజమైన పరమార్థం..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.












