తెలంగాణ

Garika Puja: గరిక పూజతో వినాయకుడు ఎందుకు ప్రసన్నుడవుతాడు? అసలు రహస్యమిదే!

రచన: Mahesh6 నిమిషాల పఠనం

Garika Puja: హిందూ సంప్రదాయంలో విఘ్నాధిపతి అయిన వినాయకుడి పూజకు విశిష్టమైన స్థానం ఉంది. వినాయక చవితి లేదా నిత్య పూజల్లో మాచీ పత్రం, బృహతీ పత్రం, దత్తూర పత్రం, అర్క పత్రం వంటి 21 రకాల దివ్య ఔషధ గుణాలు కలిగిన 'ఏకవింశతి పత్రాల'తో స్వామిని ఆరాధిస్తాం. ఎన్ని రకాల సుగంధ పుష్పాలు, విశేష పత్రాలు సమర్పించినప్పటికీ.. చివరకు గడ్డి జాతికి చెందిన చిన్న 'గరిక' లేకపోతే గణపతి పూజ అసంపూర్ణంగానే భావిస్తారు.

Garika Puja: హిందూ సంప్రదాయంలో విఘ్నాధిపతి అయిన వినాయకుడి పూజకు విశిష్టమైన స్థానం ఉంది. వినాయక చవితి లేదా నిత్య పూజల్లో మాచీ పత్రం, బృహతీ పత్రం, దత్తూర పత్రం, అర్క పత్రం వంటి 21 రకాల దివ్య ఔషధ గుణాలు కలిగిన 'ఏకవింశతి పత్రాల'తో స్వామిని ఆరాధిస్తాం. ఎన్ని రకాల సుగంధ పుష్పాలు, విశేష పత్రాలు సమర్పించినప్పటికీ.. చివరకు గడ్డి జాతికి చెందిన చిన్న 'గరిక' లేకపోతే గణపతి పూజ అసంపూర్ణంగానే భావిస్తారు. అసలు సాక్షాత్తు దేవదేవుళ్లందరూ చేయలేని ఉపశమనాన్ని కేవలం గరిక మాత్రమే ఎలా ఇవ్వగలిగింది? గరిక పూజ వెనుక దాగి ఉన్న పురాణ రహస్యం ఏమిటి? ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.

అనలాసురుడి దహనం.. గరికతోనే ఉపశమనం!

పురాణాల ప్రకారం పూర్వం 'అనలాసురుడు' (అనగా అగ్ని స్వరూపుడైన రాక్షసుడు) అనే రాక్షసుడు సమస్త లోకాలను, దేవతలను, మునులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవాడు. అతని అరాచకాల నుంచి కాపాడాలని దేవతలంతా వెళ్లి విఘ్నేశ్వరుడిని శరణు వేడారు. అప్పుడు లోక రక్షణ కోసం ఆ విఘ్ననాయకుడు ఏకంగా ఆ రాక్షసుడిని అమాంతం మింగివేశాడు. అయితే, అగ్ని తత్వమున్న రాక్షసుడిని మింగిన తర్వాత వినాయకుడి ఉదరంలో, శరీరంలో తీవ్రమైన మంటలు, విపరీతమైన వేడి పుట్టుకొచ్చాయి. ఆ వేడిని తగ్గించడానికి దేవతలంతా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరకు మహర్షులు, దేవతలు స్వామికి భక్తితో ‘గరిక’ను సమర్పించారు. ఆశ్చర్యకరంగా, ఆ గరిక స్పర్శ తగలగానే విఘ్నేశ్వరుడి శరీరం చల్లబడి, తీవ్రమైన దాహం, వేడి నుంచి తక్షణ ఉపశమనం లభించింది. నాటి నుంచి వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా గరిక పూజ స్థిరపడిపోయింది.

ఆడంబరాలు కోరని దేవుడు..

ఈ పురాణ గాథ వెనుక లోతైన జీవన సత్యం, తత్వశాస్త్రం దాగి ఉన్నాయి. విఘ్నేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి వేలకు వేలు ఖర్చు చేసి భారీ ఆడంబరాలతో పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా అతి సులభంగా, ఫ్రీగా దొరికే ఒక చిన్న గరిక పోచను నిండు మనస్సుతో, భక్తిశ్రద్ధలతో సమర్పిస్తే చాలు.. ఆయన పొంగిపోయి జీవితంలోని సకల విఘ్నాలను తొలగిస్తాడు.

మరో విశేషమేమిటంటే.. గరికకు అద్భుతమైన జీవశక్తి ఉంటుంది. నీరు ఉన్నా, లేకపోయినా.. కఠినమైన నేలలోనైనా అది మొలుస్తుంది. ఎన్నిసార్లు తొక్కినా, తుంచినా తిరిగి రెట్టింపు వేగంతో ఎదుగుతుంది. ఇది మనిషికి పట్టుదల, ఎలాంటి కష్టాలనైనా తట్టుకుని నిలబడే మనోధైర్యాన్ని సూచిస్తుంది.

పిల్లల చదువు, బుద్ధి వికాసానికి దివ్య ఔషధం

శాస్త్రాల ప్రకారం గరికను విశేష బుద్ధి వికాసానికి, జ్ఞానానికి ప్రతీకగా చెబుతారు. తమ పిల్లలకు చదువు బాగా రావాలని, ఏకాగ్రత పెరగాలని కోరుకునే తల్లిదండ్రులు పిల్లల చేత నిత్యం వినాయకుడికి గరిక సమర్పింపజేయడం అత్యంత శ్రేయస్కరం అని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్ర రీత్యా వినాయకుడిని గరికతో పూజించడం వల్ల బుధ గ్రహం, కేతు గ్రహాల అనుకూలత లభిస్తుంది. జాతకంలో బుధ దోషాలు తొలగి, బుద్ధి వికాసం, జ్ఞాపకశక్తి, విద్యా ప్రాప్తి, మోక్ష మార్గం సిద్ధిస్తాయని పండితులు స్పష్టం చేస్తున్నారు. కేవలం భక్తితో సమర్పించే గరిక పోచతోనే ప్రసన్నుడయ్యే ఆ బొజ్జ గణపయ్యను నిష్కల్మషమైన మనసుతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి.

#Garika Puja#Ganesh Puja#Lord Ganesha#Ganesh Chaturthi#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి