Delhi Declaration : అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తూ, గ్లోబల్ మార్కెట్లను శాసించేందుకు కొన్ని దేశాలు విధిస్తున్న ఏకపక్ష ఆంక్షలు, సుంకాల బాదుడుపై బ్రిక్స్ కూటమి సమరశంఖం పూరించింది. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో సభ్యదేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించిన చారిత్రక ‘ఢిల్లీ డిక్లరేషన్’ ద్వారా గ్లోబల్ ట్రేడ్ ప్రొటెక్షనిజంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రాథమిక సూత్రాలను కాలరాస్తూ సాగుతున్న ఒంటెత్తు పోకడలను ఇకపై ఏమాత్రం ఉపేక్షించబోమని బ్రిక్స్ సభ్య దేశాలు స్పష్టం చేశాయి.
అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనపై నిరసన
డబ్ల్యూటీవో మార్గదర్శకాలకు విరుద్ధంగా పలు పాశ్చాత్య దేశాలు అమలు చేస్తున్న ఏకపక్ష వాణిజ్య సుంకాలు ప్రపంచ సరఫరా వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని బ్రిక్స్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ చట్టాల పరిధికి బయట తీసుకుంటున్న ఆర్థిక నిర్బంధ చర్యలు కేవలం అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక మూలాలనే కాక, యావత్ ప్రపంచ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయని హెచ్చరించారు. ఈ విధ్వంసకర వాణిజ్య ఆంక్షలను తక్షణమే నిలిపివేయాలని, పారదర్శకమైన బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థే అందరి అభివృద్ధికి ఏకైక పరిష్కారమని ‘ఢిల్లీ డిక్లరేషన్’ తేల్చి చెప్పింది.
రాజకీయ వైరుధ్యాలున్నా.. వాణిజ్య భద్రతపై ఐక్యత
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దౌత్యపరమైన విభేదాలు ఉన్నప్పటికీ ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియాలు ఈ డిక్లరేషన్కు సంపూర్ణ మద్దతు ప్రకటించడం గమనార్హం. భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో సాగిన ఈ దౌత్య చర్చల్లో.. రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి సభ్యదేశాలన్నీ ఆర్థిక సార్వభౌమాధికారం, అంతర్జాతీయ వాణిజ్య రక్షణ విషయంలో ఒకే గళాన్ని వినిపించాయి. వివాదాలు ఏవైనా ఉంటే పరస్పర చర్చలు, శాంతియుత దౌత్య పద్ధతుల ద్వారానే పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చాయి.
సీమాంతర ఉగ్రవాదంపై సీరియస్
ఏకపక్ష ఆంక్షలతో ఇతర దేశాలను ఆర్థికంగా నియంత్రించాలనుకునే ధోరణులను తీవ్రంగా ఖండిస్తూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పిరమిడ్ తరహాలో కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా ఉండాలని బ్రిక్స్ తీర్మానించింది. అదే సమయంలో ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ అంతర్జాతీయ వాణిజ్య కారిడార్లకు ముప్పుగా మారుతున్న సీమాంతర ఉగ్రవాదాన్ని నేతలు గట్టిగా ఎండగట్టారు. పహల్గాం సహా చోటుచేసుకున్న ఉగ్రదాడులను ప్రస్తావిస్తూ, ఉగ్రవాదానికి ఆర్థిక దన్ను అందించే నెట్వర్క్లను అంతం చేయాలని పిలుపునిచ్చారు.








