BRICS: ప్రపంచ రాజకీయాల్లో శతాబ్దాలుగా సాగుతున్న అగ్రరాజ్యాల పెత్తనానికి ఇక కాలం చెల్లినట్లేనా? కేవలం కొద్దిమంది పెత్తందారులు నిర్ణయాలు తీసుకోవడం, మిగిలిన ప్రపంచం వాటిని గుడ్డిగా పాటించడమనే వ్యవస్థకు తెరపడనుందా? ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ వార్షిక సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వేదికలను ఒక్కసారిగా షేక్ చేసింది.
"గ్లోబల్ సౌత్ దేశాలు ఇకపై నిబంధనలు పాటించేవిగా మాత్రమే ఉండకూడదు.. ప్రపంచానికి నిబంధనలను నిర్దేశించే స్థాయికి ఎదగాలి" అంటూ మోడీ చేసిన సింహగర్జన పాశ్చాత్య దేశాలకు నేరుగా పంపిన స్ట్రాంగ్ వార్నింగ్గా కనిపిస్తోంది.
అధికారం కొందరి చేతుల్లోనే ఎందుకు?
ప్రస్తుత ప్రపంచ పాలనా వ్యవస్థ పిరమిడ్ తరహాలో ఉందని మోడీ విశ్లేషించారు. పిరమిడ్ పైభాగంలో కొద్దిపాటి దేశాలు మాత్రమే కూర్చుని అధికారాన్ని, నిర్ణయాలను తమ గుప్పిట్లో ఉంచుకుంటున్నాయని.. దాని కింద ఉన్న అత్యధిక దేశాలు ఆ నిర్ణయాల ప్రభావంతో నలిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు ముందస్తుగా బలయ్యేది గ్లోబల్ సౌత్ దేశాలే అయినా, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం ఆ దేశాలకు చోటు దక్కకపోవడం దారుణమన్నారు. ఇకపై ప్రతి సభ్యదేశం క్రియాశీలక భాగస్వామిగా మారి గళం ఎత్తాల్సిన చారిత్రక సందర్భం వచ్చిందని ఆయన తేల్చి చెప్పారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు అవసరం
ఐక్యరాజ్యసమితి భద్రతామండలి (UNSC) వైఖరిపై ప్రధాని మోడీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాలం చెల్లిన నిబంధనలతో సాగుతున్న భద్రతామండలిలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమగ్ర సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించేలా, అర్హత కలిగిన ఇతర దేశాలకు తక్షణమే శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. కాలానికి అనుగుణంగా మారకపోతే అంతర్జాతీయ సంస్థల ఉనికికే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు.
బ్రిక్స్ సభ్య దేశాలు ఎవరికీ శత్రువులు కాదు
బ్రిక్స్ కూటమి ఏర్పడి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా సంస్థ ప్రస్థానాన్ని ప్రస్తావించిన మోడీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ స్పేస్, బయోటెక్నాలజీ వంటి భవిష్యత్ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని సభ్యదేశాలకు పిలుపునిచ్చారు. బ్రిక్స్ ప్రపంచ స్థాయిలో విశిష్ట శక్తిగా ఎదిగినప్పటికీ, ఈ కూటమి ఏ ఒక్కరిపై వ్యతిరేకతతో ఏర్పడింది కాదని స్పష్టం చేశారు. అయితే, ప్రపంచ సంక్షోభాలకు పరిష్కారం చూపడంలో విఫలమవుతున్న అగ్ర రాజ్యం అమెరికా, యూరోపియన్ దేశాల ద్వంద్వ ప్రమాణాలను గ్లోబల్ సౌత్ ఐక్యతతో ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు మోడీ.











