Kavitha: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అటు ప్రభుత్వం, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వైఖరిని తప్పుపట్టారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చిస్తారని అనుకుంటే.. అసెంబ్లీ బయట అధికార, ప్రతిపక్ష నాయకులు బాహాబాహీలకు పోవడం, ఒకరినొకరు వింత వింత భాషల్లో తిట్టుకోవడం బాధాకరమన్నారు కవిత. అన్నింటికంటే దురదృష్టకరం ఏంటంటే స్పీకర్ ను దుర్భాషలాడటం అని ఆమె వాపోయారు.
ప్రజా ధనం వ్యర్థం
అసెంబ్లీ బయట, లోపల దురదృష్టకరమైన పరిణామాలతో ఒక మాజీ ఎంపీగా, మాజీ ఎమ్మెల్సీగా తనకు చాలా బాధగా ఉందన్నారు కవిత. చట్టసభల్లో ఓ 10 నిమిషాలు ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి పని చేస్తే లక్షలాది జీవితాలు మారినటువంటి సందర్భాలు ఈ దేశ చరిత్రలో ఉన్నాయని గుర్తు చేశారు. కనీస బాధ్యతను మర్చిపోయి ప్రజా ధనాన్ని వ్యర్థం చేస్తున్నామనే ఇంగితం లేకుండా పోయిందని అధికార, ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
కమలహాసన్ను తలపించిన సీఎం రేవంత్
''ఒక పక్క బీఆర్ఎస్, ఇంకోపక్క కాంగ్రెస్ ప్రజలతో ఆడుకుంటున్నాయి. ఈ రెండింటి మధ్య బీజేపీ మరో విచిత్రమైన పాత్ర పోషిస్తోంది. అందులో సగం మంది కాంగ్రెస్ పక్షాన ఉన్నారు, సగం మంది బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు. అంతిమంగా ఏ ఒక్కరు కూడా ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. సీఎం రేవంత్ అసెంబ్లీలో కమలహాసన్ ను తలపించారు. అసెంబ్లీలో ఏకపాత్రాభినయం చేశారు. అసెంబ్లీని పూర్తిగా తన అడ్వర్టైజ్ మెంట్ కోసం వాడుకుంటున్నారు.
అవును.. దేవుడు మీకు అన్నీ ఇచ్చాడు
తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని ముఖ్యమంత్రి ఆయన. ఒక గెజిట్ ను ఉపయోగించుకుని తెలంగాణ తల్లిని ప్రతిష్టించింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి అనే కుట్రకు తెరలేపారు. అసెంబ్లీ సాక్షిగా తన పాపాలను కడుక్కోవడానికి, తన క్యారెక్టర్ ను గొప్పగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కమీషన్లు తీసుకునే అవసరం నాకు లేదు.. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు అని రేవంత్ అంటున్నారు. అవును దేవుడు మీకు అన్నీ ఇచ్చాడు. ఈ రాష్ట్రాన్ని దోచుకుని తినడానికి మీకు పెద్ద మిత్ర మండలినే ఇచ్చాడు. భయంకరమైన కుటుంబాన్ని ఇచ్చాడు. అదే విధంగా అవినీతి ఎలా చేయాలో అనేదాంట్లో రాటుదేలిన ఒక మంచి బృందాన్ని కూడా భగవంతుడు మీకిచ్చాడు.
ఆర్టీఐ చట్టంతో బ్లాక్ మెయిల్
22ఏ పేరుతో పొంగులేటి శ్రీనివాస రెడ్డి వసూలు చేసుకుని వచ్చి మీకు ఇవ్వాలి. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీకు వసూలు చేసుకుని వచ్చి ఇవ్వాలి. ఇసుకను సీతక్కకు రాసి ఇచ్చేశారు. ఇలా ఒక్కో రంగం ఒక్కొక్కరికి రాసిచ్చి అవినీతి సామ్రాట్ గా రేవంత్ రెడ్డి ఉన్నారు. అవన్నీ కప్పిపుచ్చడానికే నాకెందుకు కమీషన్లు అని మీరు అంటున్నారు. ఈ రాష్ట్రంలో ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేసి పెద్దఎత్తున అనేక మంది వ్యాపారవేత్తలను, రియల్ ఎస్టేట్ వాళ్లను బ్లాక్ మెయిల్ చేసింది మీరు కాదా? మొత్తం రాష్ట్రంలో ఉన్న బ్లాక్ మెయిలర్స్ అందరికీ ఒక సంఘం పెడితే దానికి అధ్యక్షుడిగా మీరు ఉండరా?
అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తారా? లేకపోతే రారా?
రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అలా నిలబడి మాట్లాడుతుంటే.. అడ్డుకోవడానికి ప్రతిపక్షం లేదు. అసలు బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంటి? అసెంబ్లీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనొచ్చు. మరి కౌన్సిల్ లో మీ సభ్యులు ఉన్నారు కదా. అక్కడి నుంచి ఎందుకు వాకౌట్ చేశారు? కౌన్సిల్ లో ఎందుకు ప్రజా సమస్యల గురించి మాట్లాడలేకపోయారు? వచ్చిన అవకాశాన్ని ఎందుకు దుర్వినియోగం చేసుకుంటున్నారు. అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తారా? లేకపోతే రారా? ఇది చాలా అన్యాయం. దీన్ని బీఆర్ఎస్ వాళ్లు సమీక్షించుకోవాలి'' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కవిత.









