Dance Master Raju : బుల్లితెరపై సంచలనం సృష్టించిన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ 10’ విన్నర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు తాజాగా లైంగిక వేధింపుల కేసులో అరెస్టయ్యాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి తనపై లైంగిక దాడికి, వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ యువతి మియాపూర్ పోలీస్ స్టేషన్లో సంచలన ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో రాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినప్పటికీ.. దాదాపు మూడు రోజుల పాటు పోలీసులు ఈ విషయాన్ని బయటికి తెలియనివ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వెండితెర కలల పేరుతో అకృత్యం
డ్యాన్స్ మాస్టర్గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్న రాజు.. వెండితెరపై అవకాశాలు వెతుక్కుంటున్న ఓ యువతిని టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సినిమాల్లో మంచి ఆఫర్లు ఇప్పిస్తానని, ప్రముఖులతో పరిచయాలు చేయిస్తానని నమ్మించి ఆమెను లైంగికంగా వేధించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తనపై సాగిన వేధింపులు భరించలేక చివరికి మియాపూర్ పోలీసులను ఆశ్రయించినట్లు బాధితురాలు కంప్లైంట్లో వెల్లడించింది. బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టి, ఆధారాలు సేకరించిన అనంతరం ఈ నెల 9వ తేదీన రాజుపై కేసు నమోదు చేశారు.
కోర్టుకు హాజరు.. రిమాండ్ విధింపు
కేసు నమోదు చేసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు డ్యాన్స్ మాస్టర్ రాజును అదుపులోకి తీసుకున్నారు. అతడిని జడ్జి ముందు హాజరుపరచగా.. కేసు పూర్వాపరాలను పరిశీలించి నిందితుడికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు రాజును జైలుకు తరలించారు.
మూడు రోజుల పాటు గుట్టుగా ఎందుకు ఉంచారు
అయితే ఇంతటి సంచలన కేసు నమోదై, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించి మూడు రోజులు గడుస్తున్నా మియాపూర్ పోలీసులు మాత్రం ఈ సమాచారాన్ని బయటికి రానివ్వకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద డ్యాన్స్ షో విన్నర్ అరెస్టయిన విషయాన్ని బయటకు పొక్కకుండా చూసేందుకు ఎవరైనా ఒత్తిడి తెచ్చారా? లేక పోలీసులు కావాలనే ఈ విషయాన్ని దాచారా? అనే కోణంలో జోరుగా చర్చ సాగుతోంది. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర కలకలం మొదలైంది.










