BRICS Summit: ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్ తొలిరోజు అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే మూడు పవర్ఫుల్ దేశాలకు చెందిన కీలక నాయకులు ఒకే ఫ్రేమ్లో కనిపించారు. భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ ఒకే దగ్గర కనిపించారు. ప్రధాని మోదీ వారిద్దరి చేతులు పట్టుకుని నవ్వులు చిందించారు.
ఈ ఫొటోను ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ఒకే చోట ఉన్న ముగ్గురు కీలక దేశాధినేతలకు సంబంధించిన ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యావత్ ప్రపంచం దృష్టిని ఈ పిక్ ఆకర్షిస్తోంది. ఈ ఒక్క ఫొటోతో అగ్రరాజ్యం అమెరికా సహా వెస్ట్రర్న్ కంట్రీస్కు ముగ్గురు నేతలు బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది బ్రిక్స్ సమ్మిట్కే హైలైట్ అని అంటున్నారు. కాగా, చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ నవ్వడం తొలిసారి చూస్తున్నామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
భారత్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తరలివచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముగ్గురు అగ్రనేతలు ఎంతో స్నేహపూర్వకంగా కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ ఇండియాకు వచ్చారు. శనివారం మధ్యాహ్నం జిన్ పింగ్ ఢిల్లీకి చేరుకోగా, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ శుక్రవారమే ఇండియా చేరుకున్నారు.
భారత్ అధ్యక్షతన నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు శనివారం ఘనంగా ప్రారంభమైంది. ప్రధాని మోదీ తన ప్రారంభ ఉపన్యాసంలో కీలక పిలుపునిచ్చారు. ప్రపంచ గమనాన్ని నిర్దేశించడంలో గ్లోబల్ సౌత్ దేశాలు ఇకపై వెనుక వరుసకే పరిమితం కాకుండా నిర్ణయాధికారాల్లో కీలక భాగస్వాములు కావాలన్నారు. వివిధ అంశాలపై వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తమైనా 'ఢిల్లీ డిక్లరేషన్'కు బ్రిక్స్ దేశాధినేతలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
ఈ సదస్సుకు హాజరైన ప్రపంచ దేశాల అధినేతలకు ప్రధాని మోదీ సాదరంగా స్వాగతం పలికారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్ సిసి, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ కు ప్రధాని మోదీ వెల్ కమ్ చెప్పారు. మరీ ముఖ్యంగా చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ కు.. రామేశ్వరం ఆలయ ప్రాముఖ్యతను, దాని చారిత్రక విశిష్టతను మోదీ వివరించారు. అలాగే భారతీయ సాంస్కృతిక వైభవాన్ని కూడా దేశాధినేతలకు తెలియజేశారు.











