శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది కేవలం కృష్ణుని పుట్టినరోజు వేడుక మాత్రమే కాదు.. అది మానవ జీవితంలో అజ్ఞానమనే చీకటిని తొలగించి, ఆధ్యాత్మిక వెలుగును ప్రసరింపజేసే దివ్యమైన సంకేతంగా భావిస్తారు.. శ్రీమద్భగవద్గీతలోని నాల్గవ అధ్యాయంలో భగవంతుడు స్వయంగా ఇలా చెబుతాడు.. "యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్... పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్, ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే" అని..
సమాజంలో అధర్మం పెరిగిపోయి, సజ్జనులకు రక్షణ లేనప్పుడు, ధర్మాన్ని తిరిగి ప్రతిష్టించడానికి పరమాత్ముడే స్వయంగా మానవ రూపంలో అవతరిస్తాడు. ద్వాపర యుగంలో కంసుడు, జరాసంధుడు వంటి అసురుల అరాచకాలు పెరిగిపోయినప్పుడు, భూభారాన్ని తగ్గించి ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీకృష్ణుడు శ్రావణ బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రంలో జన్మించాడని మన పురాణాలు చెబుతాయి..
అయితే ఈ అవతరణ వెనుక లోతైన అంతరార్థం దాగి ఉంది. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి వేళ, కంసుని కారాగారంలో జన్మించాడు. ఇక్కడ కారాగారం అనేది మన అహంకారానికి, అజ్ఞానానికి, లౌకిక బంధాలకు ప్రతీక. ఆ అర్ధరాత్రి వేళ వ్యాపించి ఉన్న గాఢాంధకారం మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అజ్ఞానాన్ని సూచిస్తుంది. అటువంటి మనస్సులో జ్ఞాన భాస్కరుడైన శ్రీకృష్ణుడు (ఆత్మజ్ఞానం) జన్మించిన వెంటనే, అజ్ఞానమనే సంకెళ్లు విడిపోతాయి, బంధనాలనే కారాగార తలుపులు తమంతట తావే తెరుచుకుంటాయి.
అలాగే దేవకి అంటే పరిశుద్ధమైన బుద్ధి, వసుదేవుడు అంటే నిర్మలమైన భక్తి లేదా చిత్తం. శుద్ధమైన బుద్ధి, భక్తి కలిసినప్పుడే అక్కడ భగవంతుని ఆవిర్భావం సాధ్యమవుతుంది. ఆ తర్వాత కృష్ణుడిని పెంచిన యశోద "ఆనందానికి, యశస్సుకు" ప్రతీక. అనగా నిర్మలమైన నిష్కామ భక్తికి మాత్రమే భగవంతుడు లొంగుతాడు అనడానికి గోకులంలో శ్రీ కృష్ణుని లీలలే నిదర్శనంగా పేర్కొంటున్నారు..
ఇక "కృష్ణ" అంటే అందరినీ తన వైపు ఆకర్షించే ఆనందరూపుడు అని అర్థం. ప్రతి జీవుడి హృదయంలో భగవంతుడు ఉన్నప్పటికీ, లౌకిక మాయలో పడి ఆ అంతర ఆనందాన్ని మనం మరచిపోతున్నాం. జన్మాష్టమి నాడు చేసే ఉపవాసం అంటే కేవలం ఆహారం మానడం కాదు, మనస్సును భగవంతునికి దగ్గరగా ఉంచడం.. జాగరణ అంటే అజ్ఞాన నిద్ర నుండి మేల్కొని ఆత్మజ్ఞానాన్ని పొందడం. శ్రీకృష్ణ తత్త్వాన్ని అర్థం చేసుకుని, ఆయన చూపిన నిష్కామ కర్మయోగాన్ని జీవితంలో ఆచరించడమే జన్మాష్టమి లో ఉన్న ఆధ్యాత్మిక పరమార్థం అని అంటున్నారు..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.












