ఆ సర్వేశ్వరుడు ఈ అనంత విశ్వానికి, సమస్త జీవకోటికి నాధుడు.. అంతటి భగవంతుని మనసా స్మరిస్తూ, 'అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ' అని మనల్ని మనం ఆ పరమాత్మకు సంపూర్ణంగా అర్పించుకోవడమే నిజమైన భక్తి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ పరాత్పరుని నామస్మరణలో ఎటువంటి ప్రతిఫలాన్నీ ఆశించకుండా, తన్మయత్వం చెందడం భక్తికి పరాకాష్ఠగా సూచిస్తున్నారు..
రామకార్యం కోసం తననే అర్పించుకున్న హనుమంతుని నిష్కామ సేవ, మహావిష్ణువును నిరంతరం మోసే గరుత్మంతుని వినమ్రత, శివుని ధ్యానంలో నిరంతరం నిమగ్నమయ్యే నందీశ్వరుని తత్త్వం, అలాగే సద్గురువును దైవంగా భావించి అనుసరించే శిష్యుని శ్రద్ధ... ఇవన్నీ భక్తికి సజీవ నిదర్శనాలుగా పేర్కొంటున్నారు. భగవత్ తత్త్వాన్ని అవగాహన చేసుకున్న సాధకుడి హృదయాంతరాళాల నుంచి భక్తి భావం సహజంగా పొంగిపొర్లుతుంది.
అయితే, నేటి ఆధునిక కాలంలో భక్తి అంటే భగవంతుని సన్నిధికి వెళ్లి మన కోరికల చిట్టాను చదివి వినిపించడం అనే భావనలో చాలామంది ఉన్నారు. కోరికల నిమిత్తం ఆ పరమేశ్వరుని ప్రార్థించేవారికి అసలైన భక్తి తత్వపు పరమార్థం బోధపడనట్లేనని మన శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ దేవాదిదేవుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు. ఆయనకు తెలియనిది ఏదీ లేదు. మన భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను సృష్టించిన ఆ జగన్నాథునికి మనకు ఏ సమయానికి ఏమి కావాలో, ఏమి అక్కర్లేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన అవసరాలను ఆయన ముందర ఉంచి తీర్చమని కోరడం మన అజ్ఞానమే అవుతుంది.
ఇక శాస్త్రాల ప్రకారం భక్తి అంటే శ్రద్ధ. శ్రద్ధ అంటే తిరుగులేని, అచంచలమైన నమ్మకం. భగవంతునిపై లేదా మనల్ని నడిపించే సద్గురువుపై నిశ్చలమైన విశ్వాసం ఉండాలి. వారు చూపిన ధర్మమార్గాన్ని శిరసావహించి నడిచే భక్తునిపైనే ఆ పరమాత్మ అనుగ్రహం నిరంతరం ఉంటుందని చెబుతారు. అలాగే ఒక సామాన్యుడి ఆలోచనకూ, నిజమైన భక్తుని అంతరంగానికీ ఉన్న ప్రధానమైన తేడా వారి నడవడికలో, మాట తీరులో, ప్రవర్తనలో తెలుస్తుందని అంటారు..
పూర్ణ శరణాగతికి అత్యుత్తమ ఉదాహరణ కృష్ణార్జునుల అనుబంధం. శ్రీకృష్ణుడు అర్జునునికి రథసారథి కావడం వెనుక మహత్తరమైన అంతరార్థం ఉంది. సంసారమనే జీవిత యుద్ధరంగంలో మన జీవిత రథాన్ని నడిపే బాధ్యతను సంపూర్ణంగా ఆ సర్వేశ్వరునికే అప్పగిస్తే, ఆ అంతర్యామి మనల్ని విజయం వైపు నడిపిస్తాడు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు "నేను కావాలా, నా సైన్యం కావాలా?" అని అడిగినప్పుడు, దుర్యోధనుడు విషయ వాంఛలతో భౌతిక శక్తి అయిన సైన్యాన్నే కోరుకున్నాడు. కానీ అర్జునుడు మాత్రం "భగవంతుడవైన నీవే నాకు కావాలి, నీవే నా రథసారథివి" అని పరమాత్మను శరణువేడాడు. ఆ శరణాగతే పాండవులకు కురుక్షేత్రంలో అపారమైన విజయాన్ని చేకూర్చింది.
మనం కూడా ఆ అనంత శక్తిని శరణువేడి, మనసా వాచా కర్మణా ఆ పరమేశ్వరుడికి మన జీవితాన్ని అంకితం చేసిననాడు, మనకు కావలసినవి అడగకుండానే సిద్దిస్తాయని, తల్లి ప్రేమను మించిన అపారమైన ఆ భగవంతుని వాత్సల్యం మనపై నిరంతరం వర్షిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.. అందుకే ఆ భగవదనుగ్రహాన్ని పొంది, ముక్తి మార్గాన్ని చేరుకోవడానికి అచంచలమైన, నిష్కామ భక్తి ఒక్కటే మార్గం అని వేదాలు పురాణాలు చెబుతున్నాయి..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.









