మన సనాతన ధర్మంలో దేవాలయ దర్శనానికి అత్యుత్తమ స్థానం ఉంది. ఆలయంలో భక్తి పూర్వకంగా దైవాన్ని దర్శించినప్పుడు కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేము.. ఆలయ పరిసరాలు నిత్యం మంత్రోచ్ఛారణాలతో పవిత్రంగా మారి అక్కడికి వెళ్ళిన భక్తుల మనస్సులను ఉత్తేజ భరితం చేస్తాయి. అందుకే ఆలయానికి వెళ్లినప్పుడు శాస్త్రోక్తంగా కొన్ని విధులను పాటించాలని.. అప్పుడే ఆ దర్శనం పూర్ణ ఫలాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి..
మొదటగా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు పుష్కరిణి లేదా కుళాయి నీటితో శుభ్రంగా కాళ్లు, చేతులు కడుక్కుని, ఆ పవిత్ర జలాన్ని శిరస్సుపై చల్లుకోవాలి. నుదుటన తిలకం ధరించి, ఆ క్షేత్రానికి రక్షకుడైన క్షేత్రపాలకుడికి మనస్ఫూర్తిగా నమస్కరించాలి. అనంతరం ఆలయ ప్రాకారం చుట్టూ భక్తితో ప్రదక్షిణం చేసి, ధ్వజస్తంభం ముందు నేలపై సాష్టాంగ నమస్కారం చేయాలి..
అనంతరం ముఖమండపంలో శ్రీవైష్ణవ ఆలయమైతే గరుత్మంతుడిని, ఆళ్వార్లను, శివాలయమైతే నందీశ్వరుడిని, రామాలయమైతే ఆంజనేయస్వామిని దర్శించుకోవాలి. ఆపై జగన్మాత అయిన అమ్మవారిని దర్శించి, గర్భగుడి ద్వారపాలకులకు వినయంగా నమస్కరిస్తూ గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టును సేవించాలని మన సనాతన ధర్మం భోధిస్తుంది. ఆ సమయంలో భగవంతుని దివ్య మంగళ రూపాన్ని మనస్సులో ధ్యానిస్తూ, ఇతర భక్తుల ధ్యానానికి భంగం కలగకుండా ప్రశాంతంగా ఉండాలని చెబుతుంది.
పూజ తర్వాత స్వామివారి మంగళహారతిని కళ్లకు అద్దుకుని, శ్రద్ధతో పవిత్ర తీర్థప్రసాదాలను స్వీకరించాలి. దర్శనం పూర్తయ్యాక ముఖమండపంలో కాసేపు ప్రశాంతంగా కూర్చుని, ఆ మానసిక ప్రశాంతతను, దైవిక అనుభూతిని ఆస్వాదిస్తూ వెలుపలికి రావాలని పండితులు చెబుతున్నారు. ఇలా శాస్త్రోక్తంగా చేసే ఆలయ దర్శనం వల్ల ఏదో ఒక రూపంలో ఫలం లభిస్తుందని పేర్కొంటున్నారు.
మరోవైపు ఆలయంలోని యంత్ర ప్రతిష్ఠాపనలు, ధ్వజస్తంభం వద్ద ఉండే దివ్య శక్తి మనలోని ప్రతికూల ఆలోచనలను తొలగించి, సానుకూల శక్తిని నింపుతుంది. మంత్రోచ్ఛారణలు, ఘంటానాదాల శబ్ద తరంగాలు మెదడును ప్రశాంతపరిచి తీవ్రమైన ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఆలయ ప్రాంగణంలో చేసే ప్రదక్షిణలు శారీరక ఆరోగ్యానికి, రక్తప్రసరణకు ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా భక్తిపూర్వకమైన ధ్యానం వల్ల మానసిక ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని శాస్త్రాలు చెబుతాయి..
శుభం భూయాత్
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.












