పవిత్రమైన శ్రావణ, కార్తీక మాసాలు వచ్చాయంటే నాన్వెజ్కు డిమాండ్ తగ్గడం సాధారణమే. చాలామంది భక్తులు ఈ మాసాల్లో మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీంతో మార్కెట్లో చికెన్, మటన్ వంటి నాన్వెజ్ లకు అంతగా డిమాండ్ ఉండదు.. దీంతో ధరలు కూడా సాధారణ రోజులతో పోలిస్తే తగ్గుముఖం పడుతుంటాయి. ప్రస్తుతం శ్రావణ మాసం ప్రభావంతో చికెన్ ధరలు ఇప్పటికే దిగివచ్చాయని భావిస్తున్న మాంసాహార ప్రియులకు షాకిచ్చేలా ధరలు మళ్ళీ పెరుగడం మొదలుపెట్టాయి..
గతవారంతో పోలిస్తే ఈ వారం చికెన్ ధరలు భారీగా పెరిగాయి. క్రితం వారం కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ. 200 నుండి రూ. 240 మధ్య ఉండగా, నేడు అది ఏకంగా రూ. 220 నుండి రూ. 270 వరకు చేరుకుంది.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాల వారీగా ఈనాటి చికెన్ ధరలను పరిశీలిస్తే.. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ. 270కి చేరింది. గుంటూరులో కేజీ రూ. 260 పలుకుతుండగా... వరంగల్, సూర్యాపేట, కామారెడ్డి ప్రాంతాల్లో రూ. 250గా ఉంది..
అలాగే విశాఖపట్నంలో కేజీ రూ. 240, పల్నాడులో రూ. 230 నుండి రూ. 250 మధ్య విక్రయిస్తున్నారు. ఇక ఖమ్మంలో రూ. 220 నుండి రూ. 240 వరకు ఉండగా, చిత్తూరులో కేజీ రూ. 220 వద్ద కొనసాగుతోంది. ఇక డిమాండ్ తగ్గినా ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణాలు పౌల్ట్రీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలేనని వ్యాపారులు చెబుతున్నారు. ప్రతికూల వాతావరణం, దాణా వ్యయం విపరీతంగా పెరగడం, ఫారాల్లో కోళ్ల సంఖ్య తగ్గడం వల్ల ఉత్పత్తుల వ్యయం పెరిగి ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు..
కేవలం చికెన్ మాత్రమే కాదు.. శ్రావణంలోనూ కోడిగుడ్ల ధరలు సెంచరీ దిశగా పరిగెడుతున్నాయి. ఇక మటన్ విషయానికి వస్తే, సీజన్తో సంబంధం లేకుండా కేజీ మటన్ ధర రూ. 800 పైనే ఉంది. మొత్తానికి, పవిత్ర శ్రావణ మాసంలోనైనా కాస్త తక్కువ ధరకు నాన్-వెజ్ దొరుకుతుందని ఆశపడ్డ చికెన్ లవర్స్కు ఈ రేట్లు తీవ్ర నిరాశనే మిగులుస్తున్నాయి.












