శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం
ఈ విశ్వం ఒక లీల అయితే, ఆ లీలలకు మూలమైన పరమాత్మ స్వరూపం శ్రీకృష్ణతత్వం. మానవుడిగా భూమిపై అవతరించి, జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘర్షణను చిరునవ్వుతో స్వీకరించి, సకల మానవాళికి ఆత్మజ్ఞానాన్ని అందించిన పూర్ణావతారమే కృష్ణావతారం అని మన పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి.. ఆ జగన్నాథుని అవతరణ సాధారణమైనది కాదు. సరిగ్గా 5,252 సంవత్సరాల క్రితం, సాధారణ పూర్వ శకం (B.C.E) 3228 జులై 18న, శ్రావణ మాసంలో, కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు, రోహిణీ నక్షత్రంలో, బుధవారం అర్థరాత్రి 12 గంటలకు ఆ పరమాత్మ మధురలో దేవకీ వసుదేవుల కడుపున జన్మించారు.
కృష్ణయ్యకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉగ్ర, యాదవ వంశాలకు చెందిన దేవకీ వసుదేవులైనప్పటికీ, ఆ పరంధాముని లీలల కోసం యశోదా నందులు పెంచిన తల్లిదండ్రులుగా ధన్యులయ్యారు. తమ్ముడు బలరాముడు, సుభద్రతో కలిసి బాల్యాన్ని ఆనందంగా గడిపిన ఆ నల్లనయ్యను గోకులంలోని ప్రజలంతా కన్నయ్య అని ప్రేమగా పిలుచుకునేవారు. ఇక ఆ భగవంతుని అవతార జీవితం మొదటినుంచీ జీవన్మరణ పోరాటమేఅని శాస్త్రాలు చెబుతున్నాయి..
కరువు, అడవి తోడేళ్ల ముప్పు వల్ల 9 ఏళ్ల వయసులోనే గోకులం నుండి బృందావనానికి మారాల్సి వచ్చింది. 14 నుండి 16 ఏళ్ల వయసు వరకు బృందావనంలో గడిపిన ఆ గోపాలకృష్ణుడు, ఆ తర్వాత ధర్మసంస్థాపనకై మధురకు చేరి తన సొంత మేనమామ, రాక్షస స్వభావుడైన కంసుడిని వధించి, కన్నతల్లిదండ్రులను చెరసాల విముక్తులను చేశారు. ఆ క్షణం నుండి ఆయన మళ్లీ ఎన్నడూ బృందావనానికి తిరిగి వెళ్లలేదని చెబుతారు..
కాలయవనుడనే సింధు రాజు నుండి రాజ్యానికి ఎదురైన ముప్పును గమనించి, మధుర ప్రజలను కాపాడుకోవడానికి ద్వారకా నగరానికి వలస వెళ్లి దానిని దివ్యంగా పునర్నిర్మించారు. గోమంతక పర్వతం వద్ద వైనతేయ ఆటవికుల సహాయంతో జరాసంధుడిని ఓడించి, తన 16-18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలోని సాందీపని ఆశ్రమంలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. గురుదక్షిణగా, గుజరాత్లోని ప్రభాస తీరంలో ఆఫ్రికా సముద్రపు దొంగలతో పోరాడి, అపహరణకు గురైన గురుపుత్రుడు పునర్దత్తుడిని కాపాడి రక్షించారు..
ధర్మానికి ఆపద వచ్చిన ప్రతిసారీ ఆ భగవంతుడు వెన్నంటే నిలిచారు. పాండవుల వనవాసం గురించి తెలుసుకుని, లక్క ఇంటి ప్రమాదం నుండి వారిని కాపాడి, తన సోదరి ద్రౌపది వివాహంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. పాండవులతో ఇంద్రప్రస్థాన్ని స్థాపించి, ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో అభయమిచ్చి ఆమెను కాపాడారు. రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలైన పాండవులకు కొండంత అండగా నిలిచారు.
శ్రీకృష్ణుడు తన జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే సంహరించారని పురాణాలు చెబుతున్నాయి.. కుస్తీదారు చాణురుడు, కంసుడు, అత్త కొడుకులైన శిశుపాలుడు, దంతవక్త్రులు. ఇక లోకకళ్యాణం కోసం జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రామం నాటికి శ్రీకృష్ణుడి వయస్సు 89 సంవత్సరాలు. సాధారణ పూర్వ శకం 3139 డిసెంబర్ 08న మృగశిర శుక్ల ఏకాదశి నాడు ప్రారంభమైన ఈ యుద్ధం, డిసెంబర్ 25 వరకు సాగిందని అంటారు..
కురుక్షేత్రం ముగిసిన 36 సంవత్సరాల తరువాత, తాను ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోవడాన్ని స్వామి స్వయంగా వీక్షించారు. అడవిలో ఏకాంతంగా ఉన్న సమయంలో జర అనే వేటగాడి బాణం తగలడంతో, తన 125 సంవత్సరాల 8 నెలల 7 రోజుల పరిపూర్ణ జీవితాన్ని ముగిస్తూ, సాధారణ పూర్వ శకం 3102 ఫిబ్రవరి 18న నిర్యాణం చెందినట్టు శాస్త్రాలు పేర్కొంటాయి..
మధురలో కన్నయ్యగా, ఒడిశాలో జగన్నాథుడిగా, మహారాష్ట్రలో విఠలుడిగా, రాజస్థాన్లో శ్రీనాథుడిగా, గుజరాత్లో ద్వారకాధీశుడు లేదా రాంచోడ్ దాస్, కర్ణాటకలోని ఉడిపిలో కృష్ణుడిగా నేటికీ విశ్వమంతా పూజలందుకుంటున్న ఆ భగవంతుని జీవితం భౌతికంగా విజయవంతమైనదిగా కనిపించకపోవచ్చు. జీవితంలో ఒక్క క్షణం కూడా ప్రశాంతత లేకుండా, ప్రతి మలుపులోనూ తీవ్ర సంఘర్షణలను ఎదుర్కొన్నారు.
కానీ ప్రతి బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తిస్తూనే, దేనికీ అంకితం కాకుండా జీవించారు. గతాన్ని, భవిష్యత్తును ఎరిగిన సర్వజ్ఞుడైనప్పటికీ, ఆయన ఎల్లప్పుడూ వర్తమానంలోనే జీవించి మానవాళికి ధర్మమార్గాన్ని ఉపదేశించారు. అందుకే శ్రీకృష్ణుని జీవితం సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరికీ సత్యం, ధర్మం, ఆధ్యాత్మికత వైపు నడిపించే మార్గదర్శిగా నిలుస్తుందని వేదాలు, పురాణాలు చెబుతాయి..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.












