తెలంగాణలో ఇటీవల ఏసీబీ దాడుల్లో బయటపడుతున్న అక్రమాస్తులు, రాజకీయ అవినీతి, అధికారుల తీరు చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునేలా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఏసీబీ ఎవరిని పట్టినా మినిమం వంద కోట్ల రాలుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.. ఒక పేద వాడికి పూటగడవడమే కష్టమైన ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ, రాజకీయాలు ఏలుతూ వందల కోట్లు వెనుక వేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని అంటున్నారు..
ఇక ఈ మధ్య కాలంలో భూపాలపల్లి జిల్లా మైనింగ్ ఏడీ జయరాజ్, ఆయన బంధువుల ఇళ్లతో కలిపి 12 చోట్ల దాడులు చేస్తే దాదాపు 100 కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయి. ఇలాంటి డైనోసార్ లు, తిమింగలాలు బీఆర్ఎస్ హయాంలో తెగ బలిసినట్టు బలమైన ఆరోపణలున్నాయి. అందులో పట్టుబడుతున్న అవినీతిపరులంతా దొరల పాలనలో ఉన్న ఘనులే అంటున్నారు..
ఇక మీడియాలో వచ్చిన ఓ లిస్టు చూస్తే, కేవలం 25 మంది అధికారుల దగ్గరే 4,320 కోట్ల రూపాయల అక్రమాస్తులు లభించాయి. దాదాపు 56 మందిపై ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదయ్యాయి. వీటి బట్టి చూస్తే.. తెలంగాణ ఏర్పడ్డాక ఎవరి బ్రతుకులు బాగుపడ్డాయనేది క్లుప్తంగా అర్థం అవుతుందని అంటున్నారు.. మరోవైపు కేసీయార్ కుటుంబం, బంధువులు, తమ అస్మదీయులు, దొరల మోచేతి నీళ్ళు తాగే నేతలు ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ అవినీతి బాగోతం బారెడు అవుతుందని ఆరోపణలున్నాయి. ఈ అవినీతితో సమాజాన్నే కలుషితం చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీఆర్ఎస్ పాలనలో నేతలతో పాటు, అధికారుల అవినీతి కళ్లు తిరిగే స్థాయిలో ఉందని, గొర్రెల స్కీమ్, చేపల స్కీమ్, బర్రెల స్కీమ్ నుంచి మొదలుకొని, కాళేశ్వరం ప్రాజెక్టు, ఫార్ములా వన్ రేస్ దాకా ప్రతిదీ అవినీతి మయమేనన్న ఆరోపణలు ఉన్నాయి. చివరికి వందల మంది రైస్ మిల్లర్లు, అందులోనూ బీఆర్ఎస్ సానుభూతిపరులు, నాయకులు వేల కోట్లు తిన్నారనేది స్పష్టమవుతోంది.
ఒక్క జిల్లా మైనింగ్ ఏడీ ఆస్తులే వంద కోట్లు ఉంటే... కీలక స్థానాల్లో ఉన్న మంత్రులు, నాయకులు, ప్రజాప్రతినిధుల సంపాదన ఇంకే రేంజులో ఉంటుందోనని సగటు తెలంగాణవాసి ఆశ్చర్యపోతున్నాడు. ఇలా బయటపడేవి కేవలం సొరచేపలే, ఇంకా దొరకని అనకొండలు ఎన్నో ఉన్నాయనే వాదన వినిపిస్తుంది.. అయితే వీరి అక్రమాలు బయటకు పొక్కకుండా ఉండేందుకు.. కేసీయార్ పాలనలో ఏసీబీని పూర్తిగా నిర్వీర్యం చేసి, అవినీతిని పట్టించుకోనట్టు వ్యవహరించారనే ఆరోపణ ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరికి ఎంత వీలైతే అంత తిన్నారనడానికి, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడమే నిదర్శనం అని పేర్కొంటున్నారు.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏసీబీకి స్వేచ్ఛ ఇవ్వడంతో, పెద్ద అనకొండల్నే టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు. ఇంకా 100 మందికి పైగా అధికారులు ఏసీబీ హిట్ లిస్టులో ఉన్నట్లు సమాచారం. పవర్ ప్రాజెక్టులు, విద్యుత్ కొనుగోళ్లు, ఇరిగేషన్ పనుల్లోనే కాక, చివరికి కార్పొరేట్ ఆసుపత్రులు, కాలేజీలకు పాలు అమ్మే పద్ధతిలో క్విడ్ ప్రోకోకి పాల్పడ్డారని కవిత స్వయంగా ప్రెస్ మీట్లలో వెల్లడించారనే కథనాలు కూడా అందరికీ తెలిసిందే..
మరోవైపు అవినీతి సొమ్ముతో కొందరు విలాసాల్లో తేలుతున్నారు. ఒక రైస్ మిల్లర్ అయితే ఏకంగా సినిమా తీస్తే, మరో ఇంజనీర్ తన కొడుకు పెళ్లిని ఏకంగా థాయ్లాండ్లో జరిపించాడు. ప్రభుత్వం రెవిన్యూ రికవరీ యాక్ట్, గ్రేహౌండ్స్ను ప్రయోగించినా రైస్ మిల్లర్ల అవినీతి పర్వం కొనసాగుతూనే ఉంది. ధరణి బాగోతాలు, హైదరాబాద్ భూకబ్జాలు తవ్వితే ఈ కంపు మరిన్ని కిలోమీటర్లు వ్యాపిస్తుంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పట్టుబడిన అధికారులు తిరిగి ఉద్యోగాల్లో చేరకుండా, వారి కుటుంబ, బినామీ ఆస్తులను అమ్మకుండా అడ్డుకునే కఠినమైన చట్టాన్ని తెచ్చి, అక్రమార్కులను జైల్లోనే ఉంచగలిగే సాహసం చేయగలరా? లేదా.. ఆ ఏముంది ఈరోజు వాళ్ళ అవినీతి బయటికి వచ్చినట్టే .. రేపు మన అవినీతి కూడా బయటపడక పోతుందా అనే కోణంలో ఈ కంపును పట్టించుకోకుండా ఉంటారా? అనే చర్చలు రాష్ట్రవ్యాప్తంగా మొదలైనట్టు చెబుతున్నారు..
ఇక గతంలో వంద కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టి ఏసీబీకి చిక్కిన అధికారుల వివరాలు పరిశీలిస్తే..
ముత్యం వెంకటరమణ (డీఈ, రెడ్కో) 400 కోట్లు.. ఆనంద్ కుమార్ (ఈఎన్సీ, కాళేశ్వరం పవర్) 320 కోట్లు.. సంకిరెడ్డి భీమారెడ్డి (డీఎస్పీ) 300 కోట్లు.. సుధాకర్ రెడ్డి (సీఈ, ఇరిగేషన్) 270 కోట్లు.. బాలకృష్ణ ఎస్ (మాజీ డైరెక్టర్, టౌన్ ప్లానింగ్) 250 కోట్లు.. వెంకటేశ్వర్లు (ఎస్ఈ, ఇరిగేషన్) 230 కోట్లు.. హరిరాం (ఈఎన్సీ, కాళేశ్వరం) 200 కోట్లు.. మోహన్ నాయక్ (ఈఎన్సీ, ఆర్ అండ్ బీ) 200 కోట్లు.. శ్రీనివాసరావు (EE ఇరిగేషన్) 180 కోట్లు.. పి రాధాకృష్ణ (సబ్ రిజిస్ట్రార్, మేడ్చల్) 160 కోట్లు.. నూనె శ్రీధర్ (EE కాళేశ్వరం) 150 కోట్లు.. సుంకరి నరహరి రావు (ల్యాండ్స్, సర్వే డీడీ) 150 కోట్లు.. రమేష్ కుమార్ (జేడీ, వాణిజ్య పన్నులు) 150 కోట్లు..
లక్ష్మీనారాయణ (అడిషనల్ కలెక్టర్) 150 కోట్లు.. బీ విఠల్ (ఎస్ఈ) 140 కోట్లు.. కనకరాజు (డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్) 130 కోట్లు.. ఆకుల జగదీశ్వర్ రెడ్డి (సీఈ, ట్రైబల్ వెల్ఫేర్) 120 కోట్లు.. పి దేవేందర్ రెడ్డి (సీపీవో, మేడ్చల్) 115 కోట్లు.. హరి భూషణ్ (ఈఈ, ఆర్ & బీ) 110 కోట్లు.. డి సత్యనారాయణరావు (ఆర్టీవో, ఖమ్మం, వరంగల్) 105 కోట్లు.. మురళీధర్ రావు (మాజీ ఈఎన్సీ, కాళేశ్వరం) 100 కోట్లు.. అనంత లక్ష్మీకుమార్ (జీఎం, వాటర్ బోర్డ్) 100 కోట్లు..
మూడ్ కిషన్ (డీటీసీ, రవాణా) 100 కోట్లు.. జ్యోతి (కమిషనర్, బండ్లగూడ) 100 కోట్లు.. రవీందర్ (చీఫ్ ఇంజినీర్, HMDA) 90కోట్లు.. ఇలా వీరందరి వద్ద వెలుగుచూసిన మొత్తం అక్రమాస్తుల విలువ అక్షరాలా 4,320 కోట్లు.. ఇది ఊహించలేని మార్గాల్లో, ఊహించనంత అక్రమార్జన..
ఇక తెలంగాణ వస్తే ఏమొచ్చింది? మిగులు రాష్ట్రం అప్పుల పాలైంది!?.. ఏమీ లేని వాళ్లకు వేల కోట్లు వచ్చాయి!?.. ప్రజల ఖజానాను దోచుకునే రాబందులు వచ్చాయి!?.. ప్రత్యేక రాష్ట్రం రావడం ప్రజల విజయం... కానీ కేసీఆర్ మార్క్ అవినీతి తిమింగలాలు తెగబడటం ఈ నేలకు పట్టిన గ్రహణం!? ఇదీ పదేళ్ల దొరల పాలనలో జరిగిన అరాచకం!? అనే ఇలాంటి వార్తలు పుంఖాలు పుంఖాలుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి..కాంగ్రెస్ నేతలు సైతం ఆరోపిస్తున్నారు..











