* అధికారుల వైఖరి మారాలి.. స్వప్రయోజనాలకు అధికారాలు వాడితే కఠిన చర్యలు
* రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే రైతులను చులకనగా చూస్తే సహించేది లేదు
* సాదాబైనామా, భూ భారతి దరఖాస్తులను నెలల తరబడి పెండింగ్లో ఉంచితే చర్యలు తప్పవు
* 22-ఏను అడ్డుపెట్టుకుని ప్రజలను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదు
* భూ రీ-సర్వేలో రైతుల నుంచి ఒక్క పైసా వసూలు చేసినా కఠిన చర్యలు
* 125 ఏళ్ల తర్వాత చేపడుతున్న సమగ్ర భూ రీ-సర్వేను మూడు దశల్లో పూర్తి చేస్తాం
* రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై ఖమ్మం-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సమీక్షలో మంత్రి పొంగులేటి
Ponguleti Srinivas Reddy: రెవెన్యూ శాఖలో ప్రజలకు ఇబ్బందులు కలిగించే అధికారుల వైఖరి మారాలని, లేకపోతే వారి పదవులు మారే పరిస్థితి వస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో భూ రీ-సర్వే, రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు, హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు, ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యేలు, ఖమ్మం-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికారులతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమీక్ష నిర్వహించారు.
భూ భారతి చట్టం ద్వారా అధికారాల వికేంద్రీకరణ
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం భూ భారతి చట్టం ద్వారా అధికారాలను క్షేత్రస్థాయికి వికేంద్రీకరించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆ అధికారాలను స్వప్రయోజనాలకు వినియోగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ధరణి వ్యవస్థలో అత్యధిక అధికారాలు కలెక్టర్ వద్దే ఉండేవని, అయినప్పటికీ ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. అందుకే భూ భారతి చట్టం ద్వారా అధికారాలను తహసీల్దార్ స్థాయి వరకు వికేంద్రీకరించామని తెలిపారు. అయితే క్షేత్రస్థాయి అధికారులు ఆ అధికారాలను ప్రజల సమస్యల పరిష్కారానికి కాకుండా స్వప్రయోజనాలకు ఉపయోగిస్తుండటంతో ఆశించిన ఫలితాలు రావడం లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
దరఖాస్తులను నెలల తరబడి ‘కోల్డ్ స్టోరేజ్’లో ఉంచొద్దు
సాదాబైనామా, భూ భారతి దరఖాస్తులను నెలల తరబడి పెండింగ్లో పెట్టడం ఏమిటని మంత్రి ప్రశ్నించారు. ప్రజలు, రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. అధికారుల పనితీరు సరిగా లేకపోవడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని, ఇది ఎంతమాత్రం కొనసాగడానికి వీల్లేదని హెచ్చరించారు.
ప్రజల ఇబ్బందులు తొలగించేందుకే భూ భారతి
రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే రైతులు, ప్రజలు కూడా ప్రభుత్వంలో భాగమేనన్న విషయాన్ని అధికారులు గుర్తించాలన్నారు. ప్రజల ఇబ్బందులు తొలగించేందుకే భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని, అధికారుల సౌకర్యం కోసం కాదని స్పష్టం చేశారు. ప్రజల కోసం రూపొందించిన చట్టాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించడం తీవ్ర తప్పిదమన్నారు.
రైతులను చులకనగా చూస్తే సహించేది లేదు
రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే రైతులను చులకనగా చూస్తే సహించేది లేదని, అధికారుల వైఖరిలో తక్షణమే మార్పు రావాలని ఆదేశించారు. “ప్రజలే ముఖ్యం.. అధికారులు కాదు” అనే విషయాన్ని ప్రతి అధికారి గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రభుత్వంలో బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ఫైళ్లను పారదర్శకంగా, నిర్ణీత సమయంలోనే క్లియర్ చేస్తున్నామని, మరి కార్యాలయాల్లో చిన్న చిన్న ఫైళ్లను నెలల తరబడి ఎందుకు పెండింగ్లో పెడుతున్నారని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారుల సౌకర్యం కోసం చట్టాలు చేయలేదని, కలెక్టర్ స్థాయిలో కూడా నిర్లక్ష్యం జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతికి తావులేదు
సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న వ్యవహారాలు ప్రభుత్వానికి తలవంపులు తెస్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. వైఖరి మార్చుకోవాలని, లేదంటే పదవులు మారే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో జరిగే చిన్న విషయమూ తన దృష్టికి వస్తుందని, తనకు ఏమీ తెలియదని అధికారులు భావించవద్దని మంత్రి అన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపారు.
22-ఏలో నిజమైన భూములే ఉండాలి
ఇటీవల 22-ఏ అంశం ప్రతిపక్షాలకు రాజకీయ ఆయుధంగా మారిందని మంత్రి అన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం 22-ఏలో ఉండాల్సిన నిజమైన భూములు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. గతంలో వివిధ ప్రభుత్వాలు జీవోలు, ఉత్తర్వుల ద్వారా క్లియర్ చేసిన భూములను కూడా 22-ఏలో చేర్చడం సరికాదన్నారు. దీనివల్ల మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు.
ప్రభుత్వం భూమిలో కొంత భాగాన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్నా, మొత్తం సర్వే నంబర్ను నిషేధిత జాబితాలో పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. భూ భారతి చట్టం అమల్లోకి వచ్చి 20 నెలలు గడిచినా, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని మినహాయించి మిగిలిన భూమిని 22-ఏ నుంచి ఎందుకు తొలగించలేదో అధికారులు సమాధానం చెప్పాలని ఆదేశించారు.
భూ రీ-సర్వేలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీ-సర్వే కార్యక్రమాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. రెవెన్యూ-అటవీ శాఖల మధ్య ఉన్న భూ వివాదాలు, సరిహద్దు సమస్యలను రీ-సర్వే ద్వారా పూర్తిగా పరిష్కరించాలని అన్నారు. భూములకు స్పష్టమైన హద్దులు నిర్ణయించాలని ఆదేశించారు. భూ భారతి, సాదాబైనామా సమస్యలకు కూడా రీ-సర్వే ద్వారా పరిష్కారం చూపాలని తెలిపారు.
ఒక్క పైసా వసూలు చేయకూడదు
అశ్వారావుపేట, దమ్మపేట ప్రాంతాల్లో సర్వేలో నిర్లక్ష్యం చేసిన బాధ్యులైన అధికారులకు ఛార్జ్ మెమోలు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. ఖమ్మంలో భూ సర్వే కోసం ఎకరాకు రూ.500 నుంచి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై మంత్రి తీవ్రంగా స్పందించారు. రైతుల నుంచి ఒక్క పైసా కూడా వసూలు చేయకూడదని, డబ్బులు వసూలు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మూడు దశల్లో భూ రీ-సర్వే పూర్తి చేయాలి
ప్రతి జిల్లాలో తొలి దశలో 70 రెవెన్యూ గ్రామాలను భూ రీ-సర్వేకు ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. నివాస ప్రాంతాలతో సహా మూడు దశల్లో సమగ్ర భూ రీ-సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. తొలి దశను 2026 నవంబర్ నెలాఖరులోగా, రెండో దశను 2027 మార్చి నెలాఖరులోగా, మూడో దశను 2027 జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని గడువులు నిర్దేశించారు.
భూ రీ-సర్వే పూర్తయితే సోదరుల మధ్య కుటుంబ వివాదాలు, కోర్టు పరిధిలోని కేసులు మినహా దాదాపు అన్ని భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మంత్రి తెలిపారు. సుమారు 125 ఏళ్ల తర్వాత సమగ్ర భూ సర్వే జరుగుతోందని, సర్వేతో సమస్త సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. అధికారులు తమ విధుల్లో అత్యంత ముఖ్యమైన విధి సర్వే అని గుర్తించి, సజావుగా, బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సంతోషంగా, గర్వంగా భావించేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్లలో అనర్హులకు మంజూరు చేస్తే చర్యలు
ఎల్-1, ఎల్-2, ఎల్-3 జాబితాల్లో ఉండి, ఇల్లు మంజూరై నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని కొనసాగించాలని మంత్రి ఆదేశించారు. రెండవ జాబితా నుంచి అనర్హులకు ఎలాంటి మంజూరు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. అనర్హులకు ఇల్లు మంజూరు అయితే సంబంధిత కలెక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఒకసారి ఇల్లు మంజూరు చేసిన తర్వాత తిరిగి రద్దు చేయకూడదని, అత్యంత పేదలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
సమీప ప్రాంతం నుంచే ఇసుక కేటాయింపు
ఇందిరమ్మ ఇండ్లకు గ్రామానికి రవాణా సహా సిమెంట్ బస్తా ధర రూ.230గా ప్రభుత్వం నిర్ణయించిందని, కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. సిమెంట్ లబ్ధిదారులకు సక్రమంగా చేరేలా కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు సమీప ప్రాంతం నుంచే ఇసుక కేటాయించాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి కలెక్టర్లు, ఎమ్మెల్యేలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. జనగామ కలెక్టర్ రూపొందించిన ఇసుక కేటాయింపు యాప్ను పరిశీలించి, అందులోని ఉత్తమ విధానాలు, ఆలోచనలను ఇతర జిల్లాల్లోనూ అమలు చేయాలని సూచించారు.
అటవీ అధికారులు సహకరించాలి
అటవీ ప్రాంతాల నుంచి ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇసుక తరలించాల్సి వస్తే అటవీ అధికారులు అనుమతులు ఇచ్చి సహకరించాలని, లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేయవద్దని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న గుడిసెలకు సంబంధించి కొత్త ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే విషయంలో డీఎఫ్ఓలు సహకరించాలని సూచించారు. కొత్తగా అటవీ భూముల ఆక్రమణలను మాత్రం అనుమతించకూడదని స్పష్టం చేశారు. ఇసుక కేటాయింపులో ఎక్కడైనా దుర్వినియోగం జరిగితే వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు.
2-బీహెచ్కే ఇళ్ల ఎంపికలో జాప్యం వద్దు
2-బీహెచ్కే ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను సెప్టెంబర్ 15లోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అత్యంత పేదలకే 2-బీహెచ్కే ఇళ్లు దక్కేలా చూడాలని, అవసరమైతే లాటరీ విధానంలో ఎంపిక చేయాలని సూచించారు.









