మన భూగోళం ఊహకందని రీతిలో వేడెక్కిపోతోంది. మానవాళి మనుగడకే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ వేసవిలో మన కళ్లముందే కనిపించిన విపరీతమైన వేడి, ఊపిరాడని ఉక్కపోత, భయానకమైన అడవుల కార్చిచ్చులు, అనూహ్యంగా ముంచెత్తిన ఆకస్మిక వరదలు.. ఇవన్నీ రాబోయే రోజుల్లో భూమి ఎంత ప్రమాదకరంగా మారబోతోందో చెప్పే చిన్న శాంపిల్ మాత్రమే అని పర్యావరణ నిపుణులు అంటున్నారు..
ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ కీలక వ్యాఖ్యలు చేశారు.. భూగోళ ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల పరిమితి దాటే సమయాన్ని వీలైనంత తక్కువగా, చిన్నదిగా మార్చడమే ఇప్పుడు మన ముందున్న ఏకైక లక్ష్యమని ఆయన హెచ్చరిస్తున్నారు. అలాగే ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు దాటడం అంటే ప్రపంచం వెంటనే అంతమైపోతుందని కాదు... కానీ, పెరిగే ప్రతి అర డిగ్రీ ఉష్ణోగ్రత మానవాళిపై కోలుకోలేని ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంటున్నారు..
ఇప్పటికే మారుతున్న వాతావరణం వల్ల భూమిపై ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోంది. ఒకవైపు ఎండల తీవ్రత పెరిగిపోతుంటే, మరోవైపు అడవులు తగలబడిపోతున్నాయి. సకాలంలో వర్షాలు పడక, పడితే ఆకస్మిక వరదలు వచ్చి సర్వస్వం తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఇవన్నీ ఇప్పటికే మానవాళి రోజువారీగా అనుభవిస్తున్న ప్రత్యక్ష నష్టాలు.. ఒకవేళ ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోక, భూమి వేడి ఇలాగే పెరిగి 1.8 డిగ్రీలకు చేరుకుంటే మాత్రం.. మళ్లీ ఎప్పటికీ బాగుచేసుకోలేని పెను విపత్తులు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు..
మరోవైపు ఇదేగనుక జరిగితే.. ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల విపరీతమైన తుపానులు, కరువు కాటకాలు విజృంభిస్తాయి. తినడానికి తిండి, తాగడానికి బొట్టు నీరు కూడా దొరకని మహా కష్టకాలం ముంచుకొస్తుంది. మంచు కొండలు వేగంగా కరిగి సముద్రాలు పొంగిపొర్లుతాయి. దీనివల్ల తీర ప్రాంతాల్లో నివసించే లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను, సర్వస్వాన్ని కోల్పోయి అనాథలుగా, శరణార్థులుగా మారే ప్రమాదం ఉందని ఐరాస నివేదిక తేల్చిచెప్పింది.
ప్రపంచంలోనే అత్యంత కీలకమైన అమెజాన్ అడవులు పూర్తిగా దెబ్బతిని, సముద్రపు నీటి ప్రవాహాల తీరే మారిపోయే భయాందోళనకర పరిస్థితులు దాపురిస్తాయని, ఈ ముప్పు నుండి భూమిని కాపాడుకోవాలంటే కేవలం పొగలు, కాలుష్యం తగ్గించడం మాత్రమే సరిపోదని సూచిస్తున్నారు.. ఇందుకోసం గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహించే ఆధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగించాలి. దేశమంతటా భారీగా మొక్కలు నాటి, అడవులను సంరక్షించుకోవాలని పేర్కొంటున్నారు..
అయితే, ఆధునిక సాంకేతికతల పేరుతో పెద్ద పెద్ద కంపెనీలు, అభివృద్ధి చెందిన దేశాలు బొగ్గు, పెట్రోల్, గ్యాస్ వాడకాన్ని తగ్గించకుండా కాలయాపన చేయడాన్ని ఐరాస తీవ్రంగా తప్పుపట్టింది. శిలాజ ఇంధనాల వాడకానికి పూర్తిగా స్వస్తి పలకడమే ఈ విపత్తులకు శాశ్వత పరిష్కారం అని సూచించింది.. ఇక వాతావరణ ముప్పుకు ప్రధాన కారణమైన ధనిక, అభివృద్ధి చెందిన దేశాలు తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేసింది..
ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈ పోరాటంలో ముందుండి నడవాలని, ప్రతి దేశం కలిసికట్టుగా బలమైన ప్రణాళికలతో ముందుకు సాగితేనే మానవ మనుగడ సాఫీగా సాగుతుందని తెలిపింది. లేదంటే భావితరాలకు భవిష్యత్తు లేకుండా పోతుందని హెచ్చరించింది.
ఇక మన ముందున్న లక్ష్యం ఉష్ణోగ్రత పరిమితిని కాపాడుకోవడమే.. సమస్త మానవాళి నాకెందుకు లే అని ఆలోచించకుండా తమవంతుగా ప్రకృతిని రక్షించుకోవడానికి సిద్దపడాలని తెలిపింది. లేదంటే మనుషులు ఎంత డెవలప్ అయిన ప్రకృతి ముందు చీమలే అని నిరూపించిన గత సంఘటనలు పునరావృతం అయ్యే అవకాశాలున్నట్టు వెల్లడించింది..










