Jammu Kashmir: జమ్ముకశ్మీర్ లో కలకలం రేగింది. ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాల్పులకు తెగబడ్డారు. దక్షిణ కశ్మీర్ లోని కుల్గాంలో ఛత్తీస్ గఢ్ కు చెందిన ఇద్దరు వలస కార్మికులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. మరొకరు గాయపడ్డారు. కాల్పులు జరిపిన తర్వాత ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాల్పులు జరిపిన టెర్రరిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇది లష్కరే తోయిబా ఉగ్రవాదులే పనే అని అనుమానిస్తున్నారు.
శుక్రవారం సాయంత్రం దక్షిణ కాశ్మీర్లోని కుల్గామ్లో ఉగ్రవాదులు స్థానికేతర కార్మికుడిని కాల్చి చంపారు. మరొకరిని గాయపరిచారు. జూలై 22 నుండి దక్షిణ కశ్మీర్లో జరిగిన రెండవ దాడి ఇది. ''కుల్గామ్లోని కిలామ్ ప్రాంతంలో స్థానికేతరులిద్దరిపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల ఘటనలో ఒకరు మరణించారు. మరొకరికి అనంతనాగ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స అందుతోంది" అని పోలీసులు తెలిపారు.
అనుమానిత ఉగ్రవాదులు సూర్యాస్తమయం తర్వాత స్థానికేతరులపై కాల్పులు జరిపి, చీకటిని ఆసరాగా చేసుకుని అక్కడి నుంచి పారిపోయారు. భద్రతా దళాలు దాడి జరిగిన ప్రదేశాన్ని దిగ్బంధించాయి. దాడి చేసిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
చాలాకాలం తర్వాత దక్షిణ కాశ్మీర్లో స్థానికేతరులపై అనుమానిత ఉగ్రవాదులు దాడి ఘటన చోటు చేసుకుంది. జూలై 22న దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్లో అమర్నాథ్ యాత్రా మార్గంలో విధుల్లో ఉన్న ఒక పోలీసును ఉగ్రవాదులు కాల్చి చంపడం తీవ్ర కలకలం రేపింది. ఆ తర్వాత భద్రతా దళాలు 3,500 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు, దక్షిణ కాశ్మీర్లో క్రియాశీల ఉగ్రవాదుల కుటుంబాలకు చెందిన రెండు ఇళ్లను పేల్చేశాయి.












