International

POKలో పాక్‌కు షాక్..! ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు? ఘర్షణలు, కాల్పుల వెనుక కార‌ణాలేంటి..?

రచన: Kashi7 నిమిషాల పఠనం

PoKలో చాలాకాలంగా స్థానిక ప్రజల్లో అసంతృప్తి ఉంది. విద్యుత్‌ ధరలు, గోదుమ పిండి ధరలు, పన్నులు, ఉపాధి, ప్రభుత్వ ఖర్చులు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఈసారి గొడ‌వ‌కు అసలు కార‌ణం మాత్రం ఎన్నికల వ్యవస్థ.

అల్ల‌ర్ల‌తో అట్టుడుకుతున్న పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్

పాక్ సైన్యం కాల్పుల్లో 40 మంది మృతి

భార‌త్‌పై విషం క‌క్కుతున్న పాకిస్తాన్

పాక్ తీరుపై తీవ్రంగా స్పందించిన భార‌త్

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌.. బయటికి చూడ‌డానికి ప్రశాంతమైన ప్రాంతంలా కనిపించినా.. ప్రస్తుతం అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపు త‌ప్పింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు.. భద్రతా బలగాలతో ఘర్షణలు.. కాల్పులతో తీవ్ర‌రూపం దాల్చాయి. వరుస మరణాలు.. ఇంటర్నెట్‌ బ్లాక్‌.. ఎన్నికల వేళ ఉద్రిక్తతలు PoKలో పరిస్థితిని అదుపు త‌ప్పేలా చేశాయి.

జూన్‌లో ప్రారంభమైన జాయింట్ అవామీ యాక్ష‌న్ క‌మిటీ (JAAC) ఉద్యమం ధరలు, విద్యుత్‌, పన్నులు వంటి ఆర్థిక సమస్యలకే పరిమితం కాకుండా.. రాజకీయ హక్కులు, స్థానిక ప్రాతినిధ్యం, పాలనలో జోక్యం, ఎన్నికల వ్యవస్థ వంటి అంశాల వైపు మ‌ళ్లింది.

అసలు గొడవ ఎక్కడ మొదలైంది?

PoKలో చాలాకాలంగా స్థానిక ప్రజల్లో అసంతృప్తి ఉంది. విద్యుత్‌ ధరలు, గోదుమ పిండి ధరలు, పన్నులు, ఉపాధి, ప్రభుత్వ ఖర్చులు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఈసారి గొడ‌వ‌కు అసలు కార‌ణం మాత్రం ఎన్నికల వ్యవస్థ.

PoK అసెంబ్లీలో పాకిస్థాన్‌లోని ఇతర ప్రాంతాల్లో నివసించే కశ్మీరీ శరణార్థుల కోసం 12 సీట్లు కేటాయించడం స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. ఈ సీట్ల ద్వారా బయట ఉన్న రాజకీయ శక్తులు తమ ప్రాంత రాజకీయాలపై ప్రభావం చూపుతున్నాయనేది స్థానిక ఉద్యమకారుల ఆరోపణ. ఇదే సమయంలో JAACను పాకిస్థాన్‌ ప్రభుత్వం నిషేధించడం.. ఉద్యమ నాయకులపై చర్యలు తీసుకోవడం.. పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఒకవైపు ప్రజలు రోడ్డెక్కారు.. మరోవైపు ప్రభుత్వం భద్రతా బలగాలను రంగంలోకి దించింది.

కాల్పుల్లో ఎంత మంది చ‌నిపోయారు..?

జూలై 27న ఎన్నికల సమయంలో అనేక ప్రాంతాల్లో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు జరిగాయి. ముఖ్యంగా రావ‌ల్‌కోట్, మీర్పూర్, తర‌క్క‌ల్ ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా మారింది. ఒక్క రావ‌ల్‌కోట్‌లో జరిగిన ఘర్షణల్లోనే 30 మందికి పైగా మరణించారని JAAC పేర్కొంది. మిగిలిన ప్రాంతాల‌ను కూడా క‌లుపుకుంటే ఈ సంఖ్య 40కి పైగానే ఉంటుంది. అయితే పాకిస్థాన్‌ అధికారులు ఈ సంఖ్యను పూర్తిగా ధృవీకరించలేదు.

ప్రజల డిమాండ్లు ఏంటి?

PoK ఉద్యమాన్ని కేవలం పాక్ వ్యతిరేక నిరసనగా చూడటం సరైంది కాద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌జలు ప్రధానంగా ఆర్థిక ఉపశమనం, రాజకీయ ప్రాతినిధ్యం, పాలనా సంస్కరణలు, స్థానిక హక్కులు కోరుతున్నారు.

విద్యుత్‌, పిండి వంటి నిత్యావసరాలపై ఉపశమనం కావాలి. పన్నుల విధానంలో మార్పులు కావాలి. ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత పెరగాలి. రాజకీయ నాయకులకు లభించే ప్రత్యేక ప్రయోజనాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

అదే సమయంలో శరణార్థుల కోసం కేటాయించిన 12 అసెంబ్లీ సీట్లను రద్దు చేయాలి లేదా స్థానిక ప్రాతినిధ్యాన్ని దెబ్బతీయని విధంగా ఎన్నికల వ్యవస్థను మార్చాలన్న డిమాండ్‌ కూడా కీలకంగా మారింది. అంటే.. మా ప్రాంతం గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు మాకే ఉండాలి అన్న భావన ఉద్యమానికి కేంద్రంగా మారుతోంది.

పాక్‌ ప్రభుత్వం ఏం చేస్తోంది?

ఉద్యమాన్ని చర్చల ద్వారా పరిష్కరించడానికి బదులుగా.. ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. భద్రతా బలగాల మోహరింపు, అరెస్టులు, నిరసనలపై ఆంక్షలు, ఇంటర్నెట్‌, మొబైల్‌ సేవల నిలిపివేత వంటి చర్యలు పరిస్థితిని మరింత దిగ‌జార్చాయి. ఇదే సమయంలో పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. నిరసనకారులను భారత్‌లాంటి శత్రువులంటూ అభివ‌ర్ణించారు. దీనిపై తీవ్ర‌స్థాయిలో నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి.

భారత్‌ ఏమంటోంది?

PoKలో జరుగుతున్న పరిణామాలపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. అక్కడి ఆందోళనలు ఒక్కరోజులో పుట్టినవి కావని భారత విదేశాంగ శాఖ చెబుతోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవస్థాగత దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, పరిపాలనా అణచివేత కారణంగానే ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని భారత్ చెబుతోంది.

నిరసనలకు సమాధానంగా బలప్రయోగం చేయడం కాకుండా ప్రజల సమస్యలను పరిష్కరించాలని భారత్ డిమాండ్ చేస్తోంది. అంతేకాదు, ఈ పరిణామాలపై అంతర్జాతీయ సమాజం కూడా దృష్టిపెట్టాల‌ని పిలుపునిచ్చింది.

PoKలో ప్రస్తుతం జరుగుతున్నది కేవలం పోలీసులు–నిరసనకారుల ఘర్షణ కాదు. ఇది ఆర్థిక అసంతృప్తి నుంచి రాజకీయ హక్కుల డిమాండ్‌ వరకు విస్తరించిన ఉద్యమం. ఈ పరిణామాలు.. రాబోయే రోజుల్లో పాకిస్థాన్‌ అంతర్గత రాజకీయాలపైనా, భారత్‌–పాక్‌ సంబంధాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.

#PoK Crisis#POK Protest#Pakistan Occupied Kashmir#POK News#POK Latest News#Pakistan Army#Pakistan Army Firing#POK Violence#POK Clashes
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి