Pralhad Joshi: నీట్ పేపర్ లీకేజీ వ్యహారంలో యువత ఆందోళనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో విద్యాశాఖకు కొత్త మంత్రి వచ్చారు. ధర్మేంద్ర స్థానంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ బాధ్యతలు అప్పగించింది కేంద్రం. ప్రహ్లాద్ జోషి ప్రస్తుతం వినియోగదారులు, ఆహార & ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనకు అదనంగా విద్యాశాఖ బాధ్యతలు ఇచ్చింది కేంద్రం.
జోషి కర్ణాటకలోని ధార్వాడ్ పార్లమెంట్ సభ్యులు. ప్రస్తుతం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ, నూతన పునరుత్పాదక ఇంధన (MNRE) శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన అంతర్జాతీయ సౌర కూటమికి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ప్రహ్లాద్ జోషి బీఏ ఆర్ట్స్ చదివారు. ఆయన ఆర్ఎస్ఎస్ మెంబర్.
తొలుత ధార్వాడ్ జిల్లా బీజేపీ చీఫ్ అయ్యారు. ధార్వాడ్ లోక్ సభ స్థానానికి 2004, 2009, 2014, 2019, 2024 ఎన్నికల్లో గెలిచారు. 2019-24 మధ్య బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. కర్నాటక బీజేపీ చీఫ్ గా కూడా ఉన్నారు.
కొత్త విద్యాశాఖ మంత్రిపై సీజేపీ రియాక్షన్..
ప్రహ్లాద్ జోషికి కేంద్ర విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించడంపై 'కాక్రోచ్ జనతా పార్టీ' ప్రధాన ప్రతినిధి సౌరవ్ స్పందించారు. నూతన విద్యాశాఖ మంత్రిని ఆయన తనదైన శైలిలో హెచ్చరించారు. "విద్యాశాఖ మంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టినా సరే యువత గమనిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తమ సమస్యలను పరిష్కరించకపోతే యువత తిరిగి జంతర్ మంతర్కు వచ్చి ప్రభుత్వం నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తుంది. కాబట్టి వారి ప్రయోజనాలకు అనుగుణంగా పని చేయండి. పేపర్ లీక్ లను ఆపి యువత డిమాండ్లను అమలు చేయండి. త్వరలోనే కొత్త విద్యాశాఖ మంత్రిని కలుస్తాం" అని సౌరవ్ దాస్ తెలిపారు.












