TG Politics : రాష్ట్ర రాజకీయాల్లో ఒకసారిగా హాట్టాపిక్గా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డిల కేసు తాజాగా మరో కీలక మలుపు తిరిగింది. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నమోదైన కేసులో.. ఇద్దరు ఎమ్మెల్సీలకు మంజూరైన బెయిల్ను రద్దు చేయాలని తాజాగా పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.
అసెంబ్లీ వద్ద ఆందోళన సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగడం, విధులకు ఆటంకం కలిగించడం, స్పీకర్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసుల రిమాండ్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోకుండా నాంపల్లి కోర్టు ఇద్దరు ఎమ్మెల్సీలకు బెయిల్ మంజూరు చేసింది.
అయితే బెయిల్ ఇచ్చే టైంలో కోర్టు విధించిన నిబంధనలను ఎమ్మెల్సీలు ఉల్లంఘించారని తాజాగా పోలీసులు ఆరోపించారు. అలాగే వాళ్లు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యవహరించడంతో పాటు సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారని పేర్కొంటూ వారి బెయిల్ను రద్దు చేయాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇదే సమయంలో ఈ కేసును ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టుకు బదిలీ చేయాలని కూడా పోలీసులు కోరారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనపై చేసిన వ్యాఖ్యలు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిధిలోకి వస్తాయని పోలీసులు పేర్కొన్నారు.
మరోవైపు బీఆర్ఎస్ నాయకులు ఈ చర్యలను రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తున్నారు. కోర్టు విధించిన ఎలాంటి నిబంధనలు కూడా తమ పార్టీ ఎమ్మెల్సీలు ఉల్లంఘించలేదని వాళ్లు చెబుతున్నారు. అయితే పోలీసులు దాఖలు చేసిన బెయిల్ రద్దు, కేసు బదిలీ పిటిషన్లపై నాంపల్లి కోర్టు నిర్ణయం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిని రేపుతోంది.











