Sumanth: కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ఎట్టకేలకు పోలీసుల విచారణకు హాజరయ్యాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు వచ్చాడు. ఓ రియల్టర్ పై దాడి కేసులో సుమంత్ ను పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటివరకు సుమంత్ గైర్హాజరులోనే ఉన్నాడు. ఇటీవల సుమంత్ కు నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సుమంత్ తో పాటు మరో ముగ్గురికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఇదే సమయంలో సుమంత్ పోలీసుల విచారణకు హాజరయ్యాడు. విచారణ తర్వాత ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.
పోలీసులు కేసు నమోదు చేయగానే సుమంత్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కొండా సురేఖ మంత్రిగా ఉన్న సమయంలోనే అతడిపై కేసు నమోదైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు అతడు ఎక్కడున్నాడో పోలీసులు తెలుసుకోలేకపోయారు. పోలీసు ప్రత్యేక బృందాలు అతడి కోసం ముమ్మరంగా గాలించాయి. అయినా సుమంత్ ఆచూకీ కనుగొనలేకపోయారు. కాగా, నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో సుమంత్ ప్రత్యక్షమయ్యాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు అటెండ్ అయ్యాడు.
ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. సుమంత్ కు పలు షరతులు విధించింది. కేసు దర్యాప్తులో పోలీసులకు సహకరించాలని స్పష్టం చేసింది. దర్యాప్తు ప్రక్రియలో పోలీసులు కోరినప్పుడు తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కేసు దర్యాప్తును ప్రభావితం చేసే ఎలాంటి చర్యలకు పాల్పడకూడదని.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రేరేపించడం, బెదిరించడం వంటివి చేయకూడదని కోర్టు ఆదేశించింది. అంతేకాదు కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని షరతు పెట్టింది.










