ఆన్లైన్ క్లాసిఫైడ్స్ యాప్లలో వ్యభిచారం ప్రకటనలు పెట్టి, కస్టమర్లను నమ్మించి నిలువునా దోపిడీ చేస్తున్న ఒక అంతర్రాష్ట్ర ముఠాను బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో శనివారం మొత్తం 11 మంది నిందితులు పట్టుబడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను తెచ్చి, ఆన్లైన్ ద్వారా కస్టమర్లను ఆకర్షించి ఈ దందా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
వైట్ఫీల్డ్కు చెందిన ఒక వ్యక్తి జూలై 16న ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సదరు బాధితుడు యాప్లోని ప్రకటనను చూసి సంప్రదించగా, నిందితులు అతడిని హెచ్బీఆర్ లేఅవుట్కు రమ్మని లైవ్ లొకేషన్ పంపారు. బాధితుడు అక్కడికి వెళ్లగానే, ఆటోలో ఉన్న ఇద్దరు మహిళలను చూపించి మాటల్లో దించారు. ఆపై ఒక్కసారిగా అతనిపై దాడి చేసి నగదు, మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోయారు.
ఈ ఘటనపై కేజీ హళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, సీసీబీ మహిళా రక్షణ విభాగం రంగంలోకి దిగింది. జూలై 17న హెచ్బీఆర్ లేఅవుట్ పరిసరాల్లో విస్తృతంగా దాడులు నిర్వహించి 11మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నేరానికి వాడిన రెండు ఆటోలు, నాలుగు బైకులు, 13 మొబైల్ ఫోన్లు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇతర రాష్ట్రాల మహిళలకు నగరంలో వసతి కల్పిస్తూ, వారి ఫోటోలను యాప్లలో పెట్టి ఈ ముఠా వల విసురుతున్నట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియా లేదా ఆన్లైన్ వెబ్సైట్లలో వచ్చే ఇలాంటి అక్రమ ప్రకటనలను నమ్మి మోసపోవద్దని బెంగళూరు సిటీ పోలీసులు ప్రజలను హెచ్చరించారు. అనుమానాస్పద సమాచారముంటే వెంటనే హెల్ప్లైన్కు తెలపాలని కోరారు.












