రహదారులే ప్రగతికి మెట్లు.. మారుమూల గ్రామాలకూ సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం.. ఇవీ నిత్యం మన ప్రజాప్రతినిధులు, అధికారులు వేదికలపై ఇచ్చే ఉపన్యాసాలు.. కానీ, ఈ మాటలు కేవలం ఉపన్యాసాలకే పరిమితమవుతున్నాయి తప్ప.. క్షేత్రస్థాయిలో మారిన పరిస్థితులు ఏమీ లేవని ఈ సంఘటన మరోసారి నిరూపిస్తోంది.
నేటికీ అనేక మారుమూల ఏజెన్సీ గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. అత్యవసర సమయంలో వైద్యం అందక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా పొట్టంగి సమితి సుంకి గ్రామపంచాయతీ పరిధిలోని జంకర్గుడ గ్రామంలో చోటుచేసుకున్న ఘటనే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.
జంకర్గుడ గ్రామానికి చెందిన సావిత్రి అనే మహిళ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఆదివారం ఉదయం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. కానీ, ఊరికి రోడ్డు సరిగా లేకపోవడంతో గ్రామానికి అంబులెన్స్ రాలేని దుస్థితి నెలకొంది. ప్రాణాలు పోయే అత్యవసర పరిస్థితి కావడంతో... గ్రామస్థులు, బంధువులు కలిపి ఆ మహిళను డోలీలో పడుకోబెట్టి, కాలిబాటలోనే ఏకంగా 10 కిలోమీటర్ల మేర మోసుకెళ్లారు.
అలా ప్రధాన రహదారిపైకి చేరుకున్నాక.. అక్కడి నుంచి ఒక ఆటోలో ఆంధ్రాలోని సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తరలించారు. కాలం ఎంత మారినా, సైన్స్ ఎంత పురోగమించినా.. మారుమూల గిరిజన గ్రామాల్లో ఉపాధి, రవాణా, కనీస వైద్య సౌకర్యాలు లేక ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని మరోసారి రుజువైంది.. ఈ నేపథ్యంలో వైద్యం కోసం ప్రతిసారీ ఇలా ప్రాణాలకు తెగించి పోరాడాల్సి వస్తోందని, అత్యవసర సమయాల్లో ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయని గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఒకవైపు డిజిటల్ ఇండియా, రోడ్ల విస్తరణ అంటూ ప్రగల్భాలు పలుకుతున్న పాలకులు.. ఇలాంటి గ్రామాల వైపు ఎందుకు కన్నెత్తి చూడటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి, జంకర్గుడ గ్రామానికి పక్కా రహదారి సౌకర్యాన్ని కల్పించాలని, వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.












