Medak BJP: ఉమ్మడి మెదక్ జిల్లా బీజేపీ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. బయటకు అంతా సవ్యంగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. అంతర్గతంగా నేతల మధ్య ఈగోలు, ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరాయి. సొంత పార్టీ నిర్వహించే కీలక ఆందోళన కార్యక్రమాలకు ముఖం చాటేస్తూ, ఇతర పార్టీల నాయకులతో కలిసి ప్రైవేట్ వేదికలపై నవ్వులు చిందిస్తున్న ఓ కాషాయ ప్రజాప్రతినిధి తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి అనుసరిస్తున్న వింత వైఖరి పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసహనానికి కారణమవుతోంది.
పార్టీ కార్యక్రమాలకు డుమ్మా..
భూ సమస్యలు, 22A అంశంపై ఇటీవల బీజేపీ జిల్లా వ్యాప్తంగా వరుస పోరాటాలు చేపట్టింది. ఆగస్టు 31న సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం వద్ద నిర్వహించిన మహాధర్నాకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరైనా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాత్రం రాలేదు. ఆ తర్వాత నర్సాపూర్లో నిర్వహించిన ధర్నాలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ పాల్గొన్న ఆయన జాడలేడు. అంతేకాదు తన సొంత నియోజకవర్గమైన పటాన్చెరు బీరంగూడలో బాధితులతో ఎంపీ రఘునందన్ రావు నిర్వహించిన సమావేశాన్ని సైతం అంజిరెడ్డి లైట్ తీసుకున్నారు.
విచిత్రమేమిటంటే.. ఉమ్మడి జిల్లా దాటి హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర కమిటీ ధర్నాకు హాజరైన ఆయన, సొంత ఇలాకాలో మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు. ఇదే సమయంలో, ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన పటాన్చెరు సమావేశాన్ని లైట్ తీసుకున్న ఆయన మరుసటి రోజే స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి పరుగు పందెంలో పాల్గొన్నారు. తర్వాత నర్సాపూర్లో స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి ప్రైవేట్ కాలేజీ కార్యక్రమంలోనూ వేదిక పంచుకున్నారు. సొంత పార్టీ కార్యక్రమాలను బహిష్కరిస్తూ, ప్రత్యర్థి పార్టీల ప్రజాప్రతినిధులతో ఇంత సన్నిహితంగా మెలగడం చూసి కాషాయ దళం ముక్కున వేలేసుకుంటోంది.
ఇప్పటికీ చల్లారని టికెట్ పంచాయితీ..
ఎమ్మెల్సీ అంజిరెడ్డి వ్యవహారశైలి వెనుక లోక్సభ ఎన్నికల నాటి పాత కక్షలు, ఈగోలే ప్రధాన కారణమని పార్టీ వర్గాల్లో బహిరంగంగానే వినిపిస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ టికెట్ కోసం రఘునందన్ రావు, అంజిరెడ్డి తీవ్రంగా పోటీ పడ్డారు. పార్టీ అధిష్ఠానం రఘునందన్కు టికెట్ కేటాయించడంతో ఆయన ఎంపీగా గెలుపొందారు. అనంతరం అంజిరెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచినప్పటికీ, ఇద్దరి మధ్య నెలకొన్న అంతరం ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది. ముఖ్యంగా రఘునందన్ రావు నేతృత్వంలో జిల్లాలో జరిగే ఏ ఒక్క కార్యక్రమానికి కూడా తాను వెళ్లకూడదనే పంతంతో అంజిరెడ్డి వ్యవహరిస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఈగోలకు పార్టీని బలిచేస్తారా?
పార్టీ ఎదుగుదలకు జోడెడ్లలా పని చేయాల్సిన సమయంలో.. ఇలా పంతాలకు పోయి రోడ్డున పడటంపై కింది స్థాయి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో బీజేపీకి తిరుగులేని ప్రజాదరణ ఉన్న నేతగా రఘునందన్ రావు నిలబడ్డారని, అటువంటి నాయకుడితో కలిసి అడుగులు వేస్తే పార్టీకే బలం చేకూరుతుందని గుర్తు చేస్తున్నారు. వ్యక్తిగత వైరం, ఈగోలను పార్టీ ప్రయోజనాల కంటే ఎక్కువగా చూస్తే కేడర్ పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. సొంత నేతలతో పొసగని నాయకులు, పక్క పార్టీల వాళ్లతో చెట్టాపట్టాలు వేసుకోవడం పార్టీ విశ్వసనీయతనే దెబ్బతీస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరి ఈ నాయకుల లడాయిని రాష్ట్ర నాయకత్వం ఎలా చల్లారుస్తుందో చూడాలి.









