NTR-Dragon: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘డ్రాగన్’. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీలోని ఇంటర్వెల్ సీక్వెన్స్ను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇది, ఆయన గత చిత్రాల కంటే రెట్టింపు స్థాయిలో ఉండబోతోందని ఇప్పుడు చర్చ జరుగుతోంది.
ఇక, ఈ సీక్వెన్స్ కోసమే మేకర్స్ ప్రత్యేకంగా భారీ బడ్జెట్తో సెట్ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్లోనే దాదాపు రెండు నుంచి మూడు వారాల పాటు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్పై ప్లాన్ చేసిన ఈ కీలకమైన ఫైట్స్ను ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ తెరకెక్కించనున్నట్లు యూనిట్ సభ్యుల ద్వారా అందుతున్న సమాచారం. ఈ అక్టోబర్ 4వ వారంలో ఈ భారీ సెట్లో షూటింగ్ ప్రారంభించే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది.
ఇక, ఇటీవల డ్రాగన్ మూవీ షూట్లోనే ఎన్టీఆర్ గాయపడిన విషయం తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం తారక్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. పూర్తిగా కోలుకున్న తర్వాత ‘డ్రాగన్’ షూటింగ్ కోసం మళ్ళీ సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు. ఇందులో హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రశాంత్ నీల్ గత చిత్రాలు కేజీఎఫ్, సలార్ మూవీస్లో కనిపించిన డార్క్, గ్రే టోన్ విజువల్స్కు పూర్తి భిన్నంగా ‘డ్రాగన్’లో ఓ సరికొత్త విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడని అంతటా ప్రచారం కూడా జరుగుతోంది. ప్రధానంగా సినిమాలోని ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ అంతా కలర్ఫుల్గా, వైబ్రెంట్ విజువల్స్తో ఉండబోతుందట. ఇంటర్వెల్ ముందు వచ్చే భారీ యాక్షన్ బ్లాక్ తో ఎన్టీఆర్ యాక్షన్ మాస్ ఇమేజ్, ప్రశాంత్ నీల్ మార్క్ టేకింగ్ కి ‘డ్రాగన్’పై అంచనాలు రెట్టింపవుతాయని అంటున్నారు. కేజీఎఫ్ లో యష్, సలార్ లో ప్రభాస్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ని మర్చిపోయేలా ప్రశాంత్ నీల్ డ్రాగన్ కోసం హెవీ ఫైట్ సీక్వెన్సెస్ ని తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది. కాగా, ఈ సినిమాను 2027 సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు.











