ఏపీలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం లబ్దిదారులకు అందించే తల్లికి వందనం పథకంలో భాగంగా వ్యక్తిగత ఖాతాల నుంచి డబ్బులు కాజేశారు. ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం తల్లి వందనం డబ్బులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే.
అయితే, 28 మంది ఖాతాల నుంచి డబ్బు విత్ డ్రా చేయకుండా మాయం అయ్యింది. ఇందులో ఎయిర్ టెల్ సిమ్ సేల్స్ పర్సన్ హస్తం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎయిర్ టెల్ సిమ్ కంపెనీలో సేల్స్ పర్సన్ గా చేస్తున్న ఓ కేటుగాడు ఖాతాదారులకు మొబైల్ సిమ్స్ అమ్మేటప్పుడు బాధితుల వివరాలు సేకరించాడు. వారి వేలిముద్రలు, అకౌంట్ వివరాలను నమోదు చేసుకున్నాడు. ఆ వివరాల సాయంతో వారి అకౌంట్ నుండి డబ్బులు విత్ డ్రా చేసినట్టు తెలిసింది.
అయితే, ఖాతాలోని డబ్బు ఎలా మాయమైందో తెలియక బాధితులు ఆందోళన చెందుతుండగా.. చివరికి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు డబ్బులు డ్రా చేసిన నిందితులు ఉపేంద్ర, వీరారెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇదిలాఉంటే తల్లికి వందనంలో మోసాలు జరగడం ఇదే తొలిసారి కాదని తెలుస్తోంది.
గతంలోనూ ఇలాంటి మోసాలు పలుమార్లు వెలుగుచూశాయి. దీంతో లబ్దిదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే మోసపూరిత లింకులను ఓపెన్ చేయవద్దని చెబుతున్నారు. బ్యాంక్ వివరాలు, ఓటీపీ, ఆధార్ కార్డ్, ఖాతా డిటేల్స్ ఎవరితో షేర్ చేయొద్దని హెచ్చరించారు.












