Harish Rao: కృష్ణా జలాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ పై ఎక్స్ లో విరుచుకుపడ్డారు. కృష్ణా జలాలను ఏపీ తరలిస్తున్నా సీఎం రేవంత్ మౌనం వీడటం లేదని హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణకు సీఎం రేవంత్ ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి రైతులకు కాంగ్రెస్ సర్కార్ ద్రోహం చేస్తోందన్నారు. కృష్ణా జలాలను ఏపీ తరలిస్తున్నా కేఆర్ఎంబీ ప్రేక్షకపాత్ర వహిస్తోందని వాపోయారు. కృష్ణా జలాల విషయంలో తక్షణమే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాల తరలింపు
నీటి కేటాయింపులు లేకున్నా.. వరద జలాలు రాకున్నా.. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రభుత్వం బేసిన్ దాటి కృష్ణా జలాలను యథేచ్ఛగా తరలిస్తుంటే సీఎం రేవంత్ చోద్యం చూస్తుండటం తెలంగాణకు తీరని ద్రోహం అని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో సాగునీటి కష్టాలు తీవ్రమవుతుంటే.. మరోవైపు ఏపీ ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కులపై దండెత్తి కృష్ణా జలాలను అడ్డగోలుగా తరలిస్తోందని హరీశ్ రావు ఆరోపించారు.
పోతిరెడ్డిపాడు, నాగార్జున సాగర్ కుడి కాల్వ, ఇప్పుడు వెలిగొండ!
ఒకవైపు కృష్ణా బేసిన్లో భాగమైన బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టులకు నీళ్లు లేక ఆయకట్టులు ఎండిపోతుంటే.. మరోవైపు బేసిన్తో సంబంధం లేని ప్రాంతాలకు నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యధేచ్చగా నీటిని తరలిస్తోందన్నారు. ''మాల్యాల, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, నాగార్జున సాగర్ కుడి కాల్వ.. ఇప్పుడు వెలిగొండ!. తెలంగాణ వాటా నీటిని ఏపీ తరలిస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదు?'' అని హరీశ్ రావు ప్రశ్నించారు.
తెలంగాణ రైతాంగానికి తీరని ద్రోహం
రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండ సహా తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరని ద్రోహం ఇది అని విరుచుకుపడ్డారు. తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నీళ్లను మన పొలాలకు మళ్లించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏపీకి పరోక్షంగా ఎందుకు సహకరిస్తున్నారు? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వినియోగాన్ని పర్యవేక్షించాల్సిన KRMB (కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు) సైతం పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గం అన్నారు హరీశ్ రావు.
KRMB ప్రేక్షక పాత్ర
తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన సంస్థే ప్రేక్షక పాత్ర పోషిస్తే.. రాష్ట్ర నీటి హక్కులను ఎవరు కాపాడాలి? అని అడిగారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించాలని హరీశ్ రావు అన్నారు. KRMBపై ఒత్తిడి తెచ్చి, తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను నింపి, ఆయకట్టుకు నీటి సరఫరా జరిగేలా చూడాలని BRS పక్షాన కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు హరీశ్ రావు.











