Mala Mahanadu: మాలల ''ఛలో సెక్రటేరియట్'' తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రోస్టర్ విధానాన్ని సవరించాలని.. జీవో 99 వల్ల రాష్ట్రంలో మాలలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర నష్టం జరుగుతుందని.. తక్షణమే దాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ తో ఛలో సెక్రటేరియట్ కు మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఇచ్చిన పిలుపుతో భారీగా మాలలు తరలివచ్చారు. పోలీసుల నిర్భందాలను ఛేదించుకుని వచ్చి మరీ సెక్రటేరియట్ ను ముట్టడించారు.
సెక్రటేరియట్ ముట్టడికి వచ్చిన మాలలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో మాల మహానాడు జాతీయ అధికార ప్రతినిధి దార సత్యంకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ తోపులాటలో రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అస్వస్థతకు గురయ్యారు.
మాలల చలో సెక్రటేరియట్ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుండి అరెస్టుల పర్వం నడిచింది. అరెస్ట్ చేసిన వారిని హైదరాబాద్ నగరంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలకు తరలించారు పోలీసులు. రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, ఆయన బృందాన్ని సికింద్రాబాద్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకార ధోరణితో తన గొయ్యి తానే తీసుకుంటున్నారని పిల్లి సుధాకర్ ధ్వజమెత్తారు. మాలలపై కక్ష సాధింపు ఎందుకు అని నిలదీశారు. రోస్టర్ విధానాన్ని సవరించాలని, మాలలకు 20 రోస్టర్ పాయింట్లలోపు కనీసం రెండు పాయింట్లను కేటాయించాలని, జీవో నెంబర్ 99 రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు గుండాల్లా వ్యవహరించారని మండిపడ్డారు. కనీసం ఆడవాళ్ళను మహిళా పోలీసులతో అరెస్ట్ చేయించలేదని, ఇది దుర్మార్గం అని ధ్వజమెత్తారు. మాలలపై జరిగిన పోలీసుల దాడిని ప్రజాస్వామికవాదులు ఖండించాలని పిల్లి సుధాకర్ పిలుపునిచ్చారు.
''రోస్టర్ విధానం ద్వారా మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. జీవో 99 రద్దు చేసి గ్రూప్-3 లోని 26 కులాలకు న్యాయం చేయాలి. సీఎం రేవంత్ మాలలపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ మాలలను విద్య ఉద్యోగ అవకాశాలకు దూరం చేస్తున్నారు. ఈరోజు మాలలపై జరిగిన దాడి హేయమైన చర్య. ప్రభుత్వం, ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించాలి. రోస్టర్ విధానంలో 20 పాయింట్లలోపు కనీసం రెండు పాయింట్లు మాలలకు కేటాయించాలి. ప్రజాస్వామ్యబద్ధంగా సెక్రటేరియట్ కు వచ్చిన మాలలపై పోలీసులు అమానుషంగా దాడి చేసి గాయపరిచారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అన్ని జిల్లాల్లో నల్ల బ్యాడ్జిలతో అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన తెలపాలని పిలుపునిస్తున్నాం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రోస్టర్ ను సవరించకపోతే ప్రభుత్వంతో మాలలు యుద్ధం చేస్తారు'' అని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ హెచ్చరించారు.
''రాష్ట్రంలో మాలలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోంది. విద్య, ఉద్యోగ రంగాల్లో అన్యాయాన్ని అరికట్టాలంటే వెంటనే ప్రస్తుత రోస్టర్ విధానాన్ని పునఃసమీక్షించి, అవసరమైన సవరణలు చేయాలి. ప్రభుత్వం జారీ చేసిన జీవో 99లో మాలలకు రోస్టర్ పాయింట్ల కేటాయింపు జరిగిన తీరు తీవ్ర అభ్యంతరకరం. ప్రస్తుతం ఉన్న నిబంధనలు మాల సామాజిక వర్గానికి నష్టం కలిగించేలా ఉన్నాయి. వెంటనే 20 రోస్టర్ పాయింట్లలోపు కనీసం రెండు పాయింట్లను మాలలకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలి'' అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పిల్లి సుధాకర్.








