Harish Rao: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నర్సు హత్య కేసు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. నర్సుపై లైంగిక దాడికి యత్నించిగా.. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. అనంతరం అత్యాచారం కూడా చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో బిహార్ కు చెందిన మహమ్మద్ సనావుల్లాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ హత్యాచార ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. మహిళల భద్రతపై తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డల భద్రత ప్రశ్నార్థకం
రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన నర్సు శిరీష (21) కేసుపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన టార్గెట్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని హరీశ్ రావు ఆరోపించారు. నర్సుపై లైంగిక దాడి, దారుణ హత్యకు గురి కావడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల ఆస్తులకే కాదు ప్రజల ప్రాణాలకు కూడా భద్రత లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా మారుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. తెలంగాణలో ఆడబిడ్డల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని వాపోయారు. మహిళలకు భద్రత కల్పించలేని ముఖ్యమంత్రి రేవంత్ కు హోంశాఖ నిర్వహించే హక్కు లేదన్నారు. మహిళల భద్రత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
పట్టపగలే హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు
గురుకులంలో చదివి, పేదరికాన్ని జయించి నర్సుగా సేవలందిస్తున్న ఆడబిడ్డ దారుణ హత్యకు గురికావడం తీవ్రంగా కలచివేసిందన్నారు హరీశ్ రావు. హత్య తర్వాత అత్యాచారం జరిగినట్లు వస్తున్న వార్తలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. పట్టపగలు హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు రాష్ట్రంలో భద్రత డొల్లతనాన్ని బయటపెడుతుంటే.. ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? అని హరీశ్ రావు నిలదీశారు.
కాంగ్రెస్ పాలనలో క్షీణించిన శాంతి భద్రతలు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అరాచకాలు పెరిగి, శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని.. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ధ్వజమెత్తారు. హోంశాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం రేవంత్.. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా మారుతుంటే మీ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇంకెంత మంది ఆడబిడ్డలు బలైతే మీ ప్రభుత్వం మేల్కొంటుంది? మహిళలకు భద్రత కల్పించలేని మీకు హోం శాఖ నిర్వహించే నైతిక హక్కు ఉందా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితుడికి వెంటనే శిక్ష పడేలా చేయాలన్నారు. రాష్ట్రంలో దిగజారుతున్న మహిళల భద్రతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు హరీశ్ రావు.









