Konda Surekha: కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ కు తాను రాజీనామా చేయడం లేదని ప్రకటించారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. మంత్రి పదవి లేకపోయినా ఎమ్మెల్యేగా కొనసాగుతానని వెల్లడించారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తే కొండా సురేఖ ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తారనే వార్తలు వచ్చాయి. మరో పార్టీలోకి కొండా సురేఖ వెళ్తారనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి కొండా సురేఖ తెరదించారు. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని ప్రకటించారు.
రేవంత్ బ్లాక్ మెయిల్ చేశారు
తనను మంత్రి పదవి నుంచి తొలగించడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ పై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ హైకమాండ్ ను బ్లాక్ మెయిల్ చేసి తనను తొలగించేలా చేశారని ఆరోపించారు. తనను తొలగించే ఉద్దేశం హైకమాండ్ కు లేకపోయినా.. సీఎం రేవంత్ బ్లాక్ మెయిల్ కారణంగా తనను బర్తరఫ్ చేయాల్సి వచ్చిందన్నారు.
ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత
మంత్రి పదవి నుంచి తనను తొలగించినందుకు బాధ లేదన్న సురేఖ.. కానీ, ఏం తప్పు చేశాను అనేది చెప్పకుండా, కనీసం తన వివరణ కూడా తీసుకోకుండానే తొలగించడం బాధాకరం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపైనా ఆమె హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని బాంబు పేల్చారు కొండా సురేఖ. ప్రజాప్రతినిధులకే పనులు జరగని పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందన్నారు. హామీలు నెరవేర్చకపోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తోందన్నారు.
కాంగ్రెస్ మళ్లీ గెలవాలంటే చాలా మార్పులు అవసరం
క్షేత్రస్థాయి పరిస్థితిపై ప్రభుత్వం సర్వే చేయించుకుంటే మంచిదని సూచించారు. పార్టీ తీరు మారాల్సిన అవసరం ఉందన్న కొండా సురేఖ.. కాంగ్రెస్ మళ్లీ గెలవాలంటే చాలా మార్పులు చేసుకోవాలన్నారు. సీఎం రేవంత్ ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సంతోషంగా లేరని అన్నారు. వారంతా బయటకు వచ్చి ఇబ్బందులపై మాట్లాడాలని కొండా సురేఖ పిలుపునిచ్చారు.










