Konda Surekha: తనను బర్తరఫ్ చేస్తూ హైకమాండ్ తీసుకున్న నిర్ణయంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనను బర్తరఫ్ చేసేలా హైకమాండ్ ను రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. నన్ను తొలగించకపోతే తాను వెళ్లిపోతానని రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలను బెదిరించారని చెప్పారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ తోనే హైకమాండ్ బర్తరఫ్ నిర్ణయం తీసుకుందన్నారు.
రేవంత్ బ్రదర్స్, పొంగులేటి కుట్ర
తన బర్తరఫ్ కుట్ర వెనుక రేవంత్ రెడ్డి సోదరులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉన్నారని ఆరోపించారు. నాకు తెలియకుండానే నా ఓఎస్ డీ సుమంత్ ను తప్పించారని, సుమంత్ అరెస్ట్ కూడా కక్షపూరిత చర్యే అని కొండా సురేఖ చెప్పారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రాసిన లేఖలను కొండా సురేఖ విడుదల చేశారు.
ఉరిశిక్ష వేసేటప్పుడు కూడా చివరి కోరిక అడుగుతారు
''నన్ను తొలగించినందుకు నేనేమీ బాధపడటం లేదు. కానీ, నేను ఏం తప్పు చేశానో కారణం చెప్పకుండానే నన్ను తొలగించటం బాధాకరం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఉరిశిక్ష వేసేటప్పుడు కూడా చివరి కోరిక అడుగుతారు. కనీసం నా వివరణ తీసుకోకుండానే బర్తరఫ్ చేశారు. నేను ఏం తప్పు చేశానో చెప్పకుండానే ఇలా ఏకపక్షంగా తొలగించడం బాధాకరం. నన్ను తొలగించే ఉద్దేశం హైకమాండ్ కు లేదు. రేవంత్ రెడ్డి హైకమాండ్ ను బ్లాక్ మెయిల్ చేసి నన్ను తొలగించారు. సురేఖను తొలగిస్తారా? నేను రాజీనామా చేయాలా? అని రేవంత్ బెదిరించారు. రేవంత్ బ్లాక్ మెయిల్ తోనే హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది'' అని కొండా సురేఖ అన్నారు.
రోశయ్య, జైపాల్ రెడ్డి కూడా ఇందిరాగాంధీని తిట్టారు
''నేను బీసీ మహిళను. ఎవరి అండ లేకుండా ప్రజల నుంచి పైకి వచ్చా. అభివృద్ధి విషయంలో నా నియోజకవర్గంపై వివక్ష చూపించారు. కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి నాపై కుట్ర చేశారు. నా శాఖలోని అంశాలపై కడియం శ్రీహరి జోక్యం చేసుకున్నారు. నా శాఖలోని అధికారులతో కడియం సమీక్షలు నిర్వహించారు. మంత్రిగా నాకు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారు. నా ప్రమేయం లేకుండానే నా శాఖలో నిర్ణయాలు తీసుకున్నారు. నాపై చర్యకు సిఫారసు చేసిన మల్లు రవి కూడా గతంలో కాంగ్రెస్ ను తిట్టిన వారే. గతంలో రోశయ్య, జైపాల్ రెడ్డి కూడా ఇందిరాగాంధీని తిట్టారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు మీరు సంతోషంగా ఉన్నారా?
మేము ప్రజా బలం ఉన్న నాయకులం. జనం మా వెంటే ఉంటారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మీరు సంతోషంగా ఉన్నారా? మంత్రులు, ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మీ బాధలు చెప్పుకోండి. ప్రజా ప్రతినిధులకే పనులు జరగని పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. హామీలు నెరవేర్చకపోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. క్షేత్రస్థాయి పరిస్థితిపై ప్రభుత్వం సర్వే చేయించుకుంటే మంచిది.
కాంగ్రెస్ మళ్లీ గెలవాలంటే చాలా మార్పులు అవసరం
పార్టీ తీరు మారాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ మళ్లీ గెలవాలంటే చాలా మార్పులు చేసుకోవాలి. సీఎం రేవంత్ ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు. మంత్రి పదవి లేకున్నా ఎమ్మెల్యేగా కొనసాగుతా. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం లేదు. నేను ఏం తప్పు చేయకుండా బర్తరఫ్ చేయడం పార్టీ తప్పు'' అని కొండా సురేఖ అన్నారు.








