Konda Surekha: కొండా సురేఖ ఎపిసోడ్ లో ఢిల్లీ కేంద్రంగా రెండు రోజుల పాటు చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలకు కాంగ్రెస్ హైకమాండ్ తెరదించింది. కొండా సురేఖతో పాటు చిన్నారెడ్డిపై చర్యలు తీసుకుంది. వారిద్దరిపై వేటు వేసింది. తద్వారా నాటకీయ పరిణామాలకు తెరదించింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని హైకమాండ్ కోరినా.. అందుకు కొండా సురేఖ ససేమిరా అన్నారు. దాంతో ఆమెను బర్తరఫ్ చేస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో వెంటనే కొండా సురేఖను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలంటూ గవర్నర్ కు లేఖ పంపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
మరోవైపు చిన్నారెడ్డిపైనా వేటు వేసింది కాంగ్రెస్ హైకమాండ్. తెలంగాణ ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డిని తొలగించింది. ఈ ఇద్దరి పై వేటు వేసి.. ముగ్గురు బీసీ మహిళలకు కీలక పదవులు ఇచ్చింది రేవంత్ ప్రభుత్వం. చిన్నారెడ్డి స్థానంలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని నియమించింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నేరెళ్ల శారదను, కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(KUDA) చైర్ పర్సన్ గా మాజీ రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణిని అపాయింట్ చేసింది ప్రభుత్వం.

కాంగ్రెస్ లో కొండా సురేఖ శకం ముగిసిందని చెప్పుకోవచ్చు. రెండున్నరేళ్లు ఆమె మంత్రిగా కొనసాగారు. పరకాల నియోజకవర్గంలో మొదలైన వివాదమే ఇప్పుడు మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ కు దారితీసింది. కాంగ్రెస్ లో మొదటి నుంచి కూడా కొండా సురేఖ కుటుంబం వివాదాదాలకు కేరాఫ్ గా మారిందన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మొదట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులతో కొండా సురేఖ కుటుంబానికి వివాదాలు చెలరేగాయి. రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకుని ఆ వివాదం సద్దుమణిగేలా చేసింది. ఆ తర్వాత సుమంత్ ఇష్యూలో కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది.
ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి కుటుంబాన్ని, ప్రజాప్రతినిధులను ఉద్దేశించి సుస్మిత దారుణంగా మాట్లాడారు. ఈ విషయంలోనూ రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకుంది. కొండా సురేఖ క్షమాపణలు చెప్పడంతో మరోసారి ఇలా జరక్కుండా చూసుకుంటామని మీనాక్షి నటరాజన్ కు హామీ ఇచ్చారు. తాజాగా నాలుగోసారి కొండా సురేఖ కుటుంబం వివాదాన్ని రాజేసింది.
ఆగస్టు 19న కొండా సురేఖ పుట్టిన రోజు వేడుకల్లో కొండా సుస్మిత ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో తీవ్ర దుమారం రేపాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర నాయకత్వం.. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందేనని హైకమాండ్ ను పట్టుబట్టింది. ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే పార్టీ శ్రేణులకు రాంగ్ మేసేజ్ వెళ్తుందని, మరిన్ని ధిక్కార స్వరాలు వినిపిస్తాయని పార్టీ పెద్దలకు రాష్ట్ర నాయకత్వం తేల్చి చెప్పింది. దాంతో కొండా సురేఖ, చిన్నారెడ్డిపై వేటు వేస్తూ హైకమాండ్ అంతిమ నిర్ణయం తీసుకుంది.










