ఇమ్మిగ్రేషన్, వీసా విధానాల్లో అమెరికా అనుసరిస్తున్న కఠిన వైఖరి ప్రభావం భారతీయులపై స్పష్టంగా కనిపిస్తోంది.. అగ్రదేశం తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలనుకునే వేలాది మంది భారతీయ విద్యార్థులు గందరగోళంలో పడుతున్నారు.. ఈ క్రమంలో భారత్కు మరో షాక్ తగిలింది. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ప్రయత్నిస్తున్న భారతీయులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది.
రాబోయే కొన్నివారాల్లో భారత దరఖాస్తుదారులకు ఉపాధి ఆధారిత EB-1 గ్రీన్ కార్డ్ లు అందుబాటులో ఉండకపోవచ్చని వెల్లడించింది. భారతీయుల నుంచి భారీ డిమాండ్ ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. మరోవైపు, అమెరికా ఆర్థిక సంవత్సరం ముగియడానికి ముందే EB-1 కేటగిరీలో భారత్కు కేటాయించిన కోటా పూర్తికావచ్చని సెప్టెంబరు వీసా బులెటిన్లో యూఎస్ విదేశాంగ శాఖ వెల్లడించింది.
ఇక ఉపాధి ఆధారిత మొదటి ప్రాధాన్యతా విభాగపు గ్రీన్ కార్డులను EB-1గా పేర్కొంటారు. అసాధారణ నైపుణ్యాలు కలిగిన వ్యక్తులు, ప్రొఫెసర్లు, పరిశోధకులు, బహుళజాతి సంస్థల ఎగ్జిక్యూటివ్లు, మేనేజర్లు ఈ విభాగం కిందకే వస్తారు. ఇప్పటికే ఇతర కేటగిరీలలో భారతీయులకు గ్రీన్ కార్డుల జారీలో తీవ్ర జాప్యం నెలకొన్న తరుణంలో ఈబీ-1పైనా పరిమితులు విధించే అవకాశం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో తాజాగా జారీ చేసిన హెచ్చరిక భారతీయులను ఇబ్బందిగా మారింది.
ఉన్నత విద్యార్హతలు కలిగిన నిపుణుల కోసం ఉద్దేశించిన EB-2 కేటగిరీ వీసాలు భారతీయులకు ఇప్పటికే లభ్యం కావని ప్రకటించారు. అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి ఆ వీసాలు అందుబాటులో లేవని అర్థం. ఆగస్టు నుంచే ఈ పరిస్థితి నెలకొంది. ఇక EB-3 కేటగిరీలోనూ గ్రీన్ కార్డుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అయితే ఈ కేటగిరీలో గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారు 12 ఏళ్లకు పైగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉండటం గమనార్హం.
ఇక భారతీయుల నుంచి భారీగా దరఖాస్తులు రావడం, అదే సమయంలో అమెరికా ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం ప్రతి దేశానికి 7 శాతం కోటా పరిమితి మాత్రమే ఉండటమే ఈ తీవ్ర జాప్యానికి ప్రధాన కారణంగా మారిందని సమాచారం. అయితే అమెరికా తీసుకునే నిర్ణయాల వల్ల వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, ఉన్నత విద్యావంతులు ఏళ్ల తరబడి గ్రీన్ కార్డ్ కోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉండిపోవాల్సి వస్తోంది.









