రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మరోసారి విమర్శలు గుప్పించారు.తెలంగాణ రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గతంలో జళ సిరులతో ప్రవహించిన కాలువలు ఇప్పుడు పడావు పడ్డాయని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వంలో అన్నదాతలు అల్లాడుతున్నారని, ప్రాజెక్టులు పడావు పడ్డాయని ఆరోపించారు.
గురువారం నర్సాపూర్ రెడ్డిపల్లి కాలువ పరిసరాల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటించారు. ఈ సందర్బంగా అక్కడ కనిపించిన దృశ్యాలను ప్రజలతో పంచుకునేందుకు మాజీ మంత్రి హరీశ్ రావు బీఆర్ఎస్ నేతలతో కలిసి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సందర్బంగా ఆయన పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎంవోను టాగ్ చేస్తూ చేసిన పోస్టు సారాంశం ఈ విధంగా ఉన్నది. ‘నీళ్లు పారాల్సిన కాలువల్లో తుమ్మ చెట్లు మొలిచాయి. కేసీఆర్ హయాంలో పరుగులు పెట్టిన ప్రాజెక్టులు మీ నిర్లక్ష్యానికి ఇలా పడావు పడ్డాయి. నర్సాపూర్ రెడ్డిపల్లి వద్ద ఆగిపోయిన కాలువ పనుల దగ్గర నేను దిగిన ఈ సెల్ఫీనే.. మీ చేతకాని పాలనకు సజీవ సాక్ష్యం. ఉమ్మడి మెదక్ జిల్లా రైతులంటే మీకెందుకంత కక్ష?’ అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వం ఎదుట పలు డిమాండ్లను హరీశ్ రావు ఉంచారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు పనులను తక్షణమే ప్రారంభించాలని కోరారు. ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు పనులను సైతం వెంటనే పూర్తి చేయాలన్నారు. మల్లన్న సాగర్ నుంచి నర్సాపూర్, ఆందోల్ కు నీళ్లు తీసుకొచ్చే కాళేశ్వరం కాలువ పనులు పూర్తి చేయాలని.. జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణకు వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులను గాలికి వదిలేసి రైతుల నోట్లో మట్టికొట్టొద్దని, వెంటనే నిధులు ఇచ్చి పనులు మొదలుపెట్టకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మాజీ మంత్రి హరీశ్ రావు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.










