తెలంగాణ

Telangana: కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ బిగ్ అటాక్.. సంచలన ఆరోపణలు చేసిన హరీశ్‌రావు!..

రచన: Venu12 నిమిషాల పఠనం

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని బీఆర్ఎస్ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.

రైతుబంధు ఎగ్గొట్టి రూ.29 వేల కోట్లు లూటీ చేశారు

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన.. కుట్రలు, కబ్జాలు, సెటిల్మెంట్లకే పరిమితం!

రైతుబీమా బంద్.. 22ఏ లో రైతుల భూములు పెట్టి ఇబ్బందులు

రుణమాఫీపై దమ్ముంటే చర్చకు రా.. సీఎం రేవంత్‌కు సవాల్

మెదక్ జిల్లాపై కక్ష సాధింపు.. సాగునీటి ప్రాజెక్టులన్నీ పడావు పెట్టారు

కౌడిపల్లి, మహమ్మద్‌నగర్‌ పీఏసీఎస్‌ల అవినీతిపై తక్షణ విచారణ జరపాలి

బీఆర్ఎస్ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని బీఆర్ఎస్ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చారు.. ఇప్పుడు వెయ్యి రోజులు దాటినా హామీలకు అతీగతి లేదని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల వైఫల్యాలను ఎండగడుతూ నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గురువారం కౌడిపల్లి మండల కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రుణమాఫీపై చర్చకు రావాలని సీఎం రేవంత్‌కు సవాల్ విసిరారు..

కౌడిపల్లి మండలంలో సగానికి పైగా రైతులకు రుణమాఫీ కాలేదని ఆరోపించిన హరీశ్‌రావు.. సీఎం రేవంత్‌రెడ్డి పోలీసుల్లేకుండా కౌడిపల్లికి రా. ఇక్కడ అందరికీ రుణమాఫీ జరిగిందని తేలితే నేను రాజీనామా చేస్తా. రుణమాఫీ కాలేదని తేలితే నువ్వు రాజీనామా చేస్తావా? అంటూ ప్రశ్నించారు.. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితికి పొంతన లేదని అన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు..

రైతుబంధు ఎగ్గొట్టి రూ.29 వేల కోట్లు లూటీ చేశారు

ఎన్నికల సమయంలో రైతులకు రూ.15 వేల రైతుబంధు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని పూర్తిగా అమలు చేయలేదని హరీశ్‌రావు విమర్శించారు. రైతులకు ఇవ్వాల్సిన రూ.29 వేల కోట్ల రైతుబంధును రేవంత్ సర్కార్ ఎగ్గొట్టిందని ఆరోపించారు. కరువు వచ్చినా, కరోనా సమయంలోనూ కేసీఆర్ రైతుబంధును ఆపలేదని గుర్తు చేశారు..

కేసీఆర్ హయాంలో 60 లక్షల మందికి పైగా రైతులకు రైతుబీమా అందించామని, రైతు మరణిస్తే వారంలోనే రూ.5 లక్షల బీమా పరిహారం అందేదని చెప్పారు. ప్రీమియం చెల్లించకపోవడంతో ఆగస్టు 13 నుంచి రైతుబీమా నిలిచిపోయిందని హరీష్ రావు ఆరోపణలు గుప్పించారు.. .

22ఏ లో రైతుల భూములు.. అమ్ముకోలేని పరిస్థితి

మహమ్మద్‌నగర్, కౌడిపల్లి ప్రాంతాల్లో 200 ఎకరాలకు పైగా భూములను, రాష్ట్రవ్యాప్తంగా కోటి ఎకరాల వ్యవసాయ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితాలో పెట్టిందని హరీశ్‌రావు ఆరోపించారు. దీంతో రైతులకు రైతుబంధు, రైతుబీమా వంటి ప్రయోజనాలు అందకపోవడంతో పాటు భూముల క్రయవిక్రయాలకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. రైతుల భూములను 22ఏ లో పెట్టిన కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ప్రజలు నిషేధిత జాబితాలో పెట్టి ఓడించాలని పిలుపునిచ్చారు..

కౌడిపల్లి పీఏసీఎస్‌లో రూ.కోటి స్వాహా?

కౌడిపల్లి పీఏసీఎస్‌లో ఒక్క గింజ వడ్లు కొనకుండానే కాంగ్రెస్ నాయకులు రూ.కోటి స్వాహా చేశారని హరీశ్‌రావు ఆరోపించారు. మహమ్మద్‌నగర్ పీఏసీఎస్‌లో జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై తమ వద్ద పూర్తి వివరాలు ఉన్నాయని అన్నారు. ఈ వ్యవహారంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఎస్పీ తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే.. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు..

మెదక్ ఉమ్మడి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రభుత్వం నిలిపివేసిందని హరీశ్‌రావు ఆరోపించారు. బసవేశ్వర, సంగమేశ్వర, ఘనపూర్ ఆనకట్ట, నర్సాపూర్–మెదక్ కాలువ పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే నర్సాపూర్ ప్రాంతంలో సుమారు 70 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాపై సీఎంకు ఎందుకంత పగ

ఉమ్మడి మెదక్ జిల్లా పై సీఎం రేవంత్ కు ఎందుకు ఇంత పగ. ఇక్కడ కాంగ్రెస్ దుకాణం బంద్ చేసుకోవాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం మోటార్లపై రాజకీయాలు చేస్తూ రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌లను డెడ్‌స్టోరేజీకి తెచ్చారని ఆరోపించారు.

డీఏపీ ధర పెరిగింది.. యూరియాకు కష్టాలు

కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటల విద్యుత్ అందేదని, ఇప్పుడు 10 గంటల కరెంటు కూడా సక్రమంగా అందడం లేదని హరీశ్‌రావు విమర్శించారు. గతంలో ఎరువుల కోసం బస్తాలు లైన్లో పెట్టేవారని, ఇప్పుడు యాప్‌ల పేరుతో రైతుల చెప్పులు లైన్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. రూ.900గా ఉన్న డీఏపీ బస్తా ధర రూ.2,100కు చేరిందని, యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు..

100 రోజుల హామీలు ఏమయ్యాయి?

ఎన్నికల ముందు 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. రూ.4 వేల పెన్షన్, రైతులకు రూ.15 వేల పెట్టుబడి సాయం, మహిళలకు నెలకు రూ.2,500, విద్యార్థులకు భరోసా కార్డులు, ఆడపిల్లలకు స్కూటీలు, రెండు లక్షల ఉద్యోగాల వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వంద రోజులు కాదు.. వెయ్యి రోజులు దాటాయి. అయినా హామీలకు అతీగతి లేదని ఆరోపించారు..

ఉద్యోగాలపై నిరుద్యోగుల ఆగ్రహం

ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగుల నుంచి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించిన హరీశ్‌రావు.. మూడేళ్లలో కనీసం 16 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు.. ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థులు, హక్కుల కోసం ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తే ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతోందని విమర్శించారు..

ఇంజనీరింగ్ విద్యార్థులపై సీఎం తప్పుడు వ్యాఖ్యలు

ఇంజనీరింగ్ విద్యార్థులపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా తప్పుబట్టారు. ఇదే క్రమంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలు తీరుపైనా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గతంలో కేసీఆర్ హయాంలో ఏకంగా 13 లక్షల మంది పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించామని హరీశ్‌రావు గుర్తుచేశారు.

కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ పథకాలను సక్రమంగా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. అలాగే, ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. మరోవైపు, పింఛన్ల పంపిణీపైనా ప్రభుత్వం కోతలు విధిస్తోందని హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో 42 లక్షల మందికి పెన్షన్లు అందించడంతో పాటు, కొత్తగా మరో 7 లక్షల మందికి పెన్షన్లను మంజూరు చేశామని గుర్తు చేశారు... అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా, వస్తున్న పాత పెన్షన్లకే రకరకాల కారణాలతో కోతలు పెడుతోందని విమర్శించారు.

77 సార్లు ఢిల్లీకి వెళ్లినా రాష్ట్రానికి తెచ్చింది గుండుసున్న

సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటి వరకు 77 సార్లు ఢిల్లీకి వెళ్లారని, వెయ్యి రోజుల్లో దాదాపు 300 రోజులు ఢిల్లీలోనే గడిపారని హరీశ్‌రావు ఆరోపించారు. ఫ్లైట్ టికెట్ల ఖర్చు తప్ప రాష్ట్రానికి తెచ్చింది గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేకపోగా కేసీఆర్ హయాంలో అమలైన పథకాలను ఒక్కొక్కటిగా నిలిపివేస్తోందని దుయ్యబట్టారు..

కేసీఆర్ పాలనే కావాలి

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలను తీసుకురావడంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారని హరీశ్‌రావు తెలిపారు.. అలాగే రూ.200గా ఉన్న పెన్షన్‌ను రూ.2 వేల వరకు పెంచి పేదలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. అలాంటి గొప్ప నాయకుడైన కేసీఆర్‌ను తిట్టడానికే రేవంత్‌రెడ్డి తన సమయం మొత్తం వృథా చేస్తున్నారు. అందుకే ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు..

#Telangana#political#BRS attack#Congress#Harish Rao#kcr#medak
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి