తెలంగాణ

KTR: 14లోపు నీళ్లిచ్చే షెడ్యూల్ విడుదల చేయకపోతే మళ్లీ పాదయాత్ర చేస్తా- కేటీఆర్

రచన: NK7 నిమిషాల పఠనం

రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి వెయ్యి రోజులు అవుతున్నా.. ఇంకా అనేక హామీలు నెరవేర్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రుణమాఫీ అన్నారు, రైతుబంధు ఇస్తామన్నారు కానీ అవేమీ అమలు చేయడం లేదని మండిపడ్డారు. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామన్నారు.. పంటలకు బోనస్ ఇస్తామన్నారు.. ఇప్పుడేమో మాట తప్పారు అని విరుచుకుపడ్డారు.

KTR: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి వెయ్యి రోజులు అవుతున్నా.. ఇంకా అనేక హామీలు నెరవేర్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రుణమాఫీ అన్నారు, రైతుబంధు ఇస్తామన్నారు కానీ అవేమీ అమలు చేయడం లేదని మండిపడ్డారు. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామన్నారు..

పంటలకు బోనస్ ఇస్తామన్నారు.. ఇప్పుడేమో మాట తప్పారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పంటలకు నీళ్లు ఇవ్వడం లేదన్న కేటీఆర్.. కళ్లముందే పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని వాపోయారు.

నీళ్లు అడిగితే రక్తం పారిస్తామంటున్నారు

కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లలో పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడిగితే రక్తం పారిస్తామంటున్నారు అని సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు కేటీఆర్. మిర్యాలగూడలో కాంగ్రెస్‌ వెయ్యి రోజుల వ్యవసాయ విధ్వంసం పేరుతో రైతుల పక్షాన బీఆర్‌ఎస్‌ నిర్వహించిన రైతు సదస్సులో కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ సర్కార్ పాలనలో రైతులు గోస పెడుతున్నారని నిప్పులు చెరిగారు.

దేశమంతా వదిలించుకున్న దరిద్రం ''కాంగ్రెస్''

''దేశమంతా వదిలించుకున్న కాంగ్రెస్ అనే దరిద్రం మన నెత్తిన వచ్చిన కూర్చుంది. ఈ దరిద్రం మాకొద్దని దేశమంతా వదిలించుకున్నారు. కానీ మన నల్లగొండ జిల్లాలో మళ్లీ ఈ దరిద్రాన్ని మనమే తెచ్చి నెత్తిన పెట్టుకున్నాం. రక్తం రుచి మరిగిన కాంగ్రెస్ అనే రాక్షస పులి ఇవాళ మళ్లీ వచ్చింది. నీళ్లు ఇయ్యమంటే మా రక్తం చల్లుతామంటారా? ఒక రక్తపిశాచి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆరోజు ఓట్ల కోసం గ్యారెంటీల పేరుతో గారడీ చేశారు. ఓట్ల కోసం 420 హామీలు ఇచ్చారు. 13 డిక్లరేషన్లు ఇచ్చారు. ఈ గల్లీలో ఉండే సిల్లీ కాంగ్రెస్ లీడర్ల మాటలు నమ్మరని ఢిల్లీకెళ్లి రాహుల్ గాంధీని పట్టుకొచ్చారు.

నీళ్ల మంత్రి కాదు కన్నీళ్ల మంత్రి

కాంగ్రెస్ లో ఉండే నల్లగొండ గల్లీ లీడర్లు, ఢిల్లీ లీడర్లు వల విసిరితే నల్లగొండ రైతులు చిక్కుకున్నారు. ఇవాళ విలవిలలాడుతున్నారు. పక్కన శ్రీశైలంలో 538 ఫీట్ల నీళ్లు ఉన్నాయి. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు సాగర్ లో నీళ్లు ఉన్నా ఈ జిల్లాలో ఉన్న మంత్రులకు సోయి లేదు. సాగర్ లో నీళ్లు ఉన్నా అన్నదాతల పట్ల ఇద్దరు మంత్రులు ఈ జిల్లాలో శనిలా దాపురించారు.

ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరొకరు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ల మంత్రి కాదు తెలంగాణ రైతుల కళ్లలో నీళ్లు పెట్టిస్తున్న కన్నీళ్ల మంత్రి. మరొకరు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఎస్ ఎల్ బీసీలో సొరంగం ఎందుకు కూలిపోయింది అంటే.. నీళ్లలో వాటర్ కలిశాయని ఆయన చెబుతున్నారు. నీళ్లలో వాటర్ కలిసిందో క్వార్టర్ లో వాటర్ కలిసిందో నాకు తెల్వదు కానీ కళ్లుండి చూడలేని కబోదులు ఈ జిల్లా మంత్రులు.

శ్రీశైలం, సాగర్ లో నీళ్లు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో శ్రీశైలం గేట్లు తెరిచే లోపే 50 టీఎంసీల నీరు సాగర్ కు వచ్చి చేరేది. దీంతో ఎంతటి కరవు పరిస్థితి ఉన్నా, ఎంతటి ఇబ్బంది ఉన్నా సాగర్ కింద వానా కాలం, ఎండా కాలం పంటలకు నీళ్లు వచ్చేవి. ఈ సీజన్ లో కూడా అవకాశం ఉంది. ఈ సీజన్ లో నిజాం సాగర్ లో ఈ నిమిషానికి 180 టీఎంసీల నీరు ఉంది.

14వ తేదీ లోపు షెడ్యూల్ ప్రకటించాలి

కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎడమ కాలువ కింద నీళ్లు ఇవ్వాల్సిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నా. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 14 సెప్టెంబర్ లోపు వినాయక చవితి లోపల నీళ్లు ఇచ్చే షెడ్యూల్ విడుదల చేయకపోతే వేలాది మంది రైతులతో కోదాడ నుంచి హాలియా దాకా మళ్లీ తిరిగి పాదయాత్ర నేనే చేస్తా. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించాలి, షెడ్యూల్ విడుదల చేయాలి. ఎన్ని తడులకు నీళ్లు ఇస్తారు? ఎప్పుడెప్పుడు ఇస్తారు? తెలియజేయాలి.

ఆరు గ్యారెంటీల గురించి అడిగితే ఆరు తడి పంటలు వేసుకోండని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డైలాగులు చెబుతున్నారు. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోని సాగర్ ఆయకట్టు ప్రాంతాల్లో సంక్షోభం వస్తోంది. రైతాంగం గుండె నిండా ఆవేదన నిండుకుంది'' అని కేటీఆర్ వాపోయారు.

#Ktr#Brs#Irrigation#Water#Uttam Kumar Reddy#Telangana Govt#Swechaa News#Sagar#Miryalaguda
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి